TTD ఈవోకు మహారాష్ట్ర భక్తుడి మెయిల్..
ABN , First Publish Date - 2021-11-18T12:01:04+05:30 IST
TTD ఈవోకు మహారాష్ట్ర భక్తుడి మెయిల్..
తిరుమల : తిరుమలలో ట్యాక్సీలో మరిచిపోయిన లగేజి బ్యాగును వెంటనే గుర్తించి అప్పగించినందుకు మహారాష్ట్రకు చెందిన ఓ భక్తుడు విజిలెన్స్ కంట్రోల్ రూమ్ సిబ్బందిని, పోలీసులను అభినందిస్తూ టీటీడీ ఈవోకు ఈ మెయిల్ పంపారు. సోలాపూర్కు చెందిన కేదార్ రాజేంద్ర కులకర్ణి అనే భక్తుడు 16వ తేది మధ్యాహ్నం 12.10 గంటల సమయంలో కౌస్తుభం విశ్రాంతి గృహానికి వెళ్లేందుకు ట్యాక్సీని బుక్ చేసుకున్నారు. అయితే హడావుడిలో ట్యాక్సీ దిగే సమయంలో బ్యాగును మరచిపోయారు. మధ్యాహ్నం 1.15 గంటల ప్రాంతంలో గుర్తించి తిరుమల పోలీసులకు, టీటీడీ విజిలెన్స్ కమాండెంట్ రూమ్ అధికారులను ఆశ్రయించారు. నిఘా, భద్రతా సిబ్బంది, పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించి పోగొట్టుకున్న బ్యాగును 1.50 గంటలకల్లా భక్తుడికి అందజేశారు. ఈ మేరకు భక్తుడు కులకర్ణి సిబ్బందిని అభినందిస్తూ బుధవారం టీటీడీ ఈవో జవహర్రెడ్డికి ఈమెయిల్ పంపారు. భక్తుడి లగేజి బ్యాగును సత్వరం వెతికి తిరిగి అప్పగించిన సిబ్బందిని సీవీఎస్వో గోపినాథ్జెట్టి అభినందించారు.