మూడు రోడ్లకు మహర్దశ
ABN , First Publish Date - 2020-11-28T06:14:33+05:30 IST
కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.68 కోట్లతో జిల్లాలో మూడు రహ దారుల విస్తరణ, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం పాలనాపరమైన అనుమతులను మంజూరుచేసింది.
విస్తరణ, అభివృద్ధి పనులకు
రూ.68 కోట్ల కేంద్రం నిధులు
పరిపాలనా ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం
విశాఖపట్నం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.68 కోట్లతో జిల్లాలో మూడు రహ దారుల విస్తరణ, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం పాలనాపరమైన అనుమతులను మంజూరుచేసింది. కశిం కోట-బంగారుమెట్ట (బుచ్చెయ్యపేట మండలం) 24.065 కిలోమీటర్ల రోడ్డుకు రూ.32 కోట్లు, జాతీయ రహదారి నుంచి పద్మనాభం మండలం రేవిడి వెంకటా పురం నుంచి ఐనాడ, కోరాడ, మజ్జిపేట మీదుగా విజయనగరం- రాయ్పూర్ జాతీయ రహదారిని కలుపుతూ 11.560 కి.మీ. రోడ్డుకు రూ.16 కోట్లు, చోడవరం మండలం గవరవరం నుంచి దేవరాపల్లి మండలం కాశీపురం వరకు 15.295 కి.మీ. రోడ్డుకు రూ.20 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ రహదారుల విస్తరణ, అభివృద్ధి పనులకు ఆర్అండ్బీ అధికారులు ఇప్పటికే టెండర్లు పిలిచారు.