వాణిజ్య ఒప్పందాలకు దూరంగా..సేంద్రీయ సాగుకు అంబాసిడర్గా
ABN , First Publish Date - 2020-07-08T08:13:43+05:30 IST
కరోనా మహమ్మారి నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇకనుంచి, వాణిజ్య...
ధోనీ కీలక నిర్ణయం
కోల్కతా: కరోనా మహమ్మారి నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇకనుంచి, వాణిజ్య ప్రకటనల ఒప్పందాలకు దూరంగా ఉండనున్నాడు. సేంద్రీయ వ్యవసాయానికి మాత్రం బ్రాండ్ అంబాసిడర్గా మారనున్నాడు. అంతేకాదు.. తన సొంత సేంద్రీయ ఎరువు బ్రాండ్ను మహీ త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనున్నాడు. ఏడాదిగా ధోనీ క్రికెట్కు దూరంగా ఉంటున్నాడు. ధోనీ మంగళవారం 39వ పుట్టిన రోజు జరుపుకొన్నాడు. ఈ సందర్భంగా ధోనీ చిన్ననాటి స్నేహితుడు, మేనేజర్ మిహిర్ దివాకర్ మాట్లాడుతూ.. ‘దేశభక్తి ధోనీ రక్తంలోనే ఉంది. అతడికి 40 నుంచి 50 ఎకరాల పొలం ఉంది. అందులో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాడు. బొప్పాయి, అరటిని సాగు చేస్తున్నాడు. ఇక.. వాణిజ్య ఉత్పత్తుల ప్రచార ఒప్పందాలను ప్రస్తుతానికి ఆపేశాడు. అయితే, నియో గ్లోబల్ పేరుతో ధోనీ సొంత సేంద్రీయ ఎరువుల బ్రాండ్ను మార్కెట్లోకి తీసుకురానున్నాడు’ అని తెలిపాడు. ఇటీవల ధోనీ ట్రాక్టర్ నడుపుతున్న ఫొటోలు నెట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
మహీకి శుభాకాంక్షల వెల్లువ..
ధోనీ పుట్టిన రోజు సందర్భంగా మాజీలు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, ప్రస్తుత టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యాతో పాటు అనేకమంది సెలెబ్రిటీలు శుభాకాంక్షలు తెలిపారు. ఇక.. వెస్టిండీస్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో అయితే.. మహీ బర్త్డే గిఫ్ట్గా ‘హెలికాప్టర్’ పేరుతో పాటను విడుదల చేశాడు.
చార్టర్ ఫ్లైట్లో రాంచీకి పాండ్యా బ్రదర్స్..
టీమిండియా ఆల్రౌండర్లు, సోదర ద్వయం హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా ప్రత్యేక విమానంలో బరోడా నుంచి రాంచీకి వెళ్లి ధోనీకి విషెస్ చెప్పడం విశేషం. రోజంతా ధోనీ ఇంట్లోనే గడిపిన పాండ్యా బ్రదర్స్.. బుధవారం స్వస్థలం రానున్నట్టు సమాచారం.