అశ్లీల పోస్టర్లపై మహిళా కమిషన్ ఆగ్రహం
ABN , First Publish Date - 2021-12-04T05:35:43+05:30 IST
అశ్లీల వాల్పోస్టర్లు, హోర్డింగులపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
తొలగించిన ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు
గుంటూరు, మంగళగిరి, డిసెంబరు 3: అశ్లీల వాల్పోస్టర్లు, హోర్డింగులపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరు, విజయవాడ హైవే మార్గంలోని అండర్ బ్రిడ్జిల వద్ద ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశించారు. దీంతో ఐసీడీఎస్ పీడీ మనోరంజని ఆధ్వర్యలో మంగళగిరి రూరల్, పెదకాకాని పోలీసులు రంగంలోకి దిగి అశ్లీల పోస్టర్లను తొలగించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ఇకపై అశ్లీల బొమ్మలతో వాణిజ్య ప్రకటనలు గానీ, సినిమాలకు సంబంధించిన పోస్టర్లు కానీ, హోర్డింగులు కానీ ఏర్పాటు చేయరాదన్నారు. అతికించిన వారిపై చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. మహిళా, శిశు సంక్షేమశాఖతో పాటు పోలీసు సిబ్బంది తమ పరిధిలో ప్రతి రోజు పర్యటిస్తూ అశ్లీలకరంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్స్, పోస్టర్లు అంటించే వారి వివరాలు తెలుసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.