యోగీపై మహువా సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-03-02T22:23:22+05:30 IST

రాష్ట్రంలో పాలన దారుణంగా ఉంది. హిందువుల మనోభావాల్ని మమతా బెనర్జీ ప్రభుత్వం కాలరాస్తోంది. ప్రభుత్వ విధానాల్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు. దుర్గా పూజకు అనుమతి నిరాకరించారు. ఈద్‌కు గోవధను ప్రారంభించారు..

యోగీపై మహువా సంచలన వ్యాఖ్యలు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ మహువా మోయిత్రా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌ను దేశానికి ‘రేప్ క్యాపిటల్’ (అత్యాచారాల రాజధాని) చేసిన యోగి ఆదిత్యనాథ్ బెంగాల్‌లో ప్రచారానికి వచ్చారని మంగళవారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా విమర్శించారు. ఇక బీజీపీ కార్యకర్తలను జాలిలేని వారిగా సంబోధించిన ఆమె యోగి సర్కస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని మహువా ఎద్దేవా చేశారు.


మంగళవారం పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో యోగి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో పాలన దారుణంగా ఉంది. హిందువుల మనోభావాల్ని మమతా బెనర్జీ ప్రభుత్వం కాలరాస్తోంది. ప్రభుత్వ విధానాల్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు. దుర్గా పూజకు అనుమతి నిరాకరించారు. ఈద్‌కు గోవధను ప్రారంభించారు. కానీ ప్రభుత్వం దీనిపై ఏమీ మాట్లాడటం లేదు. ఇవన్నీ ప్రభుత్వ సహకారంతోనే జరుగుతున్నాయి. ఇక్కడ ‘జై శ్రీరాం’ అనడాన్ని కూడా ఇష్టపడటం లేదు. మేము యూపీలో లవ్ జిహాద్ చట్టం తీసుకువచ్చాం. కానీ బెంగాల్‌లో లోపాయికారి రాజకీయాలు నడుస్తున్నాయి. అందుకే వాళ్లు లవ్ జిహాదీపై చట్టం చేయడం లేదు’’ అని అన్నారు.


ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ మహువా మోయిత్రా ‘‘ఉత్తరప్రదేశ్‌ని దేశానికి రేప్ క్యాపిటల్ చేసిన యోగి ఆదిత్యనాథ్, బెంగాల్‌లో బీజేపీ తరపున ప్రచారం చేయడానికి ఈరోజు మాల్దాకి వచ్చారు. జాలి లేని బిజెపి కార్యకర్తలు ఈ సర్కస్ చుట్టూ తిరుగుతున్నారు’’ అనే అర్థంలో తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు.

Updated Date - 2021-03-02T22:23:22+05:30 IST