రాని వ్యక్తిని నేనెట్లా తిడతాను?: మహువా మోయిత్రా

ABN , First Publish Date - 2021-07-29T23:26:57+05:30 IST

సభలో ఉన్న సభ్యులందరినీ ఓసారి నావైపుకు తిప్పుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే 13 ఏళ్లుగా ఎంపీగా ఉన్నాను. కానీ ఎప్పుడూ ఇలాంటిది ఎదుర్కోలేదు. పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఒక మహిళ నన్ను ‘బిహార్ గూండా’ అంటూ తిట్టారు

రాని వ్యక్తిని నేనెట్లా తిడతాను?: మహువా మోయిత్రా

న్యూఢిల్లీ: పార్లమెంటరీ కమిటీ సమావేశంలో తనను ‘బిహారి గుండా’ అంటూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మోయిత్రా తిట్టారని భారతీయ జనతా పార్టీ ఎంపీ నిశికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలను సదరు ఎంపీ కొట్టిపారేశారు. తాను ఎవరినీ తిట్టలేదని, వాస్తవానికి తనపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు అసలు ఆ సమావేశానికే హాజరు కాలేదని ఆమె తెలిపారు.


గురువారం లోక్‌సభలో నిశికాంత్ దూబే మాట్లాడుతూ ‘‘సభలో ఉన్న సభ్యులందరినీ ఓసారి నావైపుకు తిప్పుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే 13 ఏళ్లుగా ఎంపీగా ఉన్నాను. కానీ ఎప్పుడూ ఇలాంటిది ఎదుర్కోలేదు. పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఒక మహిళ నన్ను ‘బిహార్ గూండా’ అంటూ తిట్టారు. ఆమె త్రిణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ. నన్ను అలా ఎందుకు తిట్టారో అర్థం కాలేదు. ఈ దేశాన్ని అభివృద్ధి చేయడమే మా తప్పా కూలీల్లాగా పని చేయడమే మా తప్పా? హిందీ మాట్లాడే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల వారు ఎక్కువ శారీరక శ్రమ చేస్తారు. ఎందుకంటే మేము రాముడి నుంచి పాఠాలు నేర్చుకున్నవాళ్లం’’ అని అన్నారు.


కాగా, ఈ విషయమై మహువా మోయిత్రా స్పందిస్తూ.. ‘‘సమావేశానికి రాని వారిని నేనెట్లా తిడతాను? ఇదేం విచిత్రం. నాపై ఆరోపణలు చేస్తున్నవారు అసలు ఆ సమావేశానికే హాజరు కాలేదు. కావాల్సి ఉంటే అటెండెన్స్ షీట్ ఓసారి చెక్ చేయండి’’ అని తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో రాసుకొచ్చారు.

Updated Date - 2021-07-29T23:26:57+05:30 IST