కరోనా ఎఫెక్ట్... రికార్డు స్థాయిలో క్షీణించిన తయారీ రంగం కార్యకలాపాలు...

ABN , First Publish Date - 2021-04-06T00:39:20+05:30 IST

పరిశ్రమలను కరోనా తీవ్రంగా దెబ్బతీస్తోంది. దీని ప్రభావం కారణంగా దేశీయ తయారీరంగ కార్యకలాపాలు ఏడు నెలల కనిష్టానికి చేరాయి.

కరోనా ఎఫెక్ట్... రికార్డు స్థాయిలో క్షీణించిన తయారీ రంగం కార్యకలాపాలు...

న్యూఢిల్లీ : పరిశ్రమలను కరోనా తీవ్రంగా దెబ్బతీస్తోంది. దీని ప్రభావం కారణంగా దేశీయ తయారీరంగ కార్యకలాపాలు ఏడు నెలల కనిష్టానికి చేరాయి. కరోనా... మరోసారి విజృంభిస్తుండటంతో ఆ ప్రభావం ఉత్పత్తి కార్యకలాపాలపై పడినట్లు ఐహెచ్ఎస్ మార్కెట్ నెలవారీ సర్వే వెల్లడించింది.


ఫిబ్రవరిలో 57.5 గా ఉన్న మానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ సూచీ(పీఎంఐ) మార్చి నాటికి 55.4‌ కు తగ్గింది. కాగా, దీర్ఘకాలికంగా కొనసాగుతూ వస్తోన్న 53.6 సగటు కంటే ఇది ఎక్కువ. పీఎంఐ సూచి 50 ఎగువన నమోదైతే వృద్ధి సాధించినట్లు, అంతకంటే తక్కువగా ఉంటే క్షీణించినట్లుగా పరిగణిస్తారు.


కరోనా కేసులు భారీగా పెరుగుతోన్న క్రమంలో మార్చిలో కొత్త ఆర్డర్లు తగ్గాయని, దీంతో తయారీ కూడా నెమ్మదించిందని ఐహెచ్ఎస్ మార్కెట్ ప్రతినిధి లిమా వెల్లడించారు. ఈ క్రమంలో తయారీ కార్యకలాపాలతోపాటు కొనుగోళ్లు కూడా నేలచూపులు చూశాయని పేర్కొన్నారు.


ఆయా రాష్ట్రాల్లో చోటుచేసుకున్న కరోనా కఠిన ఆంక్షల నేపధ్యంలో భారత పరిశ్రమలకు ఏప్రిల్ నెల సవాల్ విసరనుందని పేర్కొన్నారు. ఇక ఉద్యోగ కల్పనపై కరోనా ప్రభావం ఇంకా తీవ్రంగానే ఉందన్నారు.

Updated Date - 2021-04-06T00:39:20+05:30 IST