మమ్ముట్టి, మోహన్లాల్కు UAE బంపరాఫర్.. ఈ మలయాళ టాప్ హీరోలిద్దరికీ..
ABN , First Publish Date - 2021-08-24T20:52:22+05:30 IST
మలయాళ సూపర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్లాల్ తాజాగా యూఏఈ నుంచి బంపరాఫర్ పట్టేశారు. యూఏఈ ప్రభుత్వం ఈ స్టార్ హీరోలిద్దరికీ ఒకేసారి గోల్డెన్ వీసాలు మంజూరు చేసింది. ఇది ఆ ఇద్దరికీ కూడా తొలి గోల్డెన్ వీసా కావడం విశేషం.
దుబాయ్: మలయాళ సూపర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్లాల్ తాజాగా యూఏఈ నుంచి బంపరాఫర్ పట్టేశారు. యూఏఈ ప్రభుత్వం ఈ స్టార్ హీరోలిద్దరికీ ఒకేసారి గోల్డెన్ వీసాలు మంజూరు చేసింది. ఇది ఆ ఇద్దరికీ కూడా తొలి గోల్డెన్ వీసా కావడం విశేషం. అబుధాబి ఆర్ధిక అభివృద్ధి విభాగం ఛైర్మన్ మహ్మద్ అలీ అల్ షోర్ఫా అల్ హమ్మది ఈ స్టార్స్కు గోల్డెన్ వీసాలు అందించారు. ఈ సందర్భంగా మళయాలీ సినిమా ఇండస్ట్రీకి మమ్ముట్టి, మోహన్లాల్ చేసిన కృషిని ఆయన కొనియాడారు. 10 ఏళ్ల కాలపరిమితితో వారికి గోల్డెన్ వీసాలు మంజూరు చేసినట్లు మహ్మద్ అలీ పేర్కొన్నారు.
ఇది మలయాళం సినిమాకు దక్కిన అరుదైన గౌరవం అని మోహన్లాల్ అన్నారు. అలాగే మమ్ముట్టి కూడా యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. మమ్ముట్టి, మోహన్లాల్ కంటే ముందు భారతీయ సినీ పరిశ్రమ నుంచి బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్, సంజయ్ దత్ యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్నారు. ఇక వివిధ విభాగాల్లో దేశ అభివృద్ధికి విశేష కృషి చేసిన విదేశీయులకు యూఏఈ 2019 నుంచి 5, 10 ఏళ్ల గోల్డెన్ వీసాలు ఇస్తున్న విషయం తెలిసిందే.