మల్లారెడ్డి అవినీతిపై ఆధారాలిచ్చా: రేవంత్రెడ్డి
ABN , First Publish Date - 2021-08-27T22:14:29+05:30 IST
సహచరులపై అవినీతి ఆరోపణలు వస్తే చర్యలు తీసుకుంటానని సీఎం కేసీఆర్ చెప్పారని, అవినీతి ఆరోపణలు వస్తే ఉపేక్షించనని
హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి భూ అక్రమాలకు సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వెల్లడించారు. ఆయన అవినీతిపై ఆధారాలు కూడా ఇచ్చానని తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెదిరించిన వ్యవహారంలో మల్లారెడ్డిని సీఎం కేసీఆర్ ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రశ్నించారు. 50 ఎకరాల రియల్ ఎస్టేట్ వ్యవహారంలో మల్లారెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. మల్లారెడ్డిపై విచారణకు కేసీఆర్ సాహసించలేదని తప్పుబట్టారు. లే అవుట్లలో ప్లాట్లు అమ్ముకునే వారి నుంచి మామూళ్లు వసూలు చేశారని రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
‘‘మల్లారెడ్డి యూనివర్సిటీ కోసం సేకరించిన భూమి వివరాల ప్రకారం.. సర్వే నెంబర్ 650లో 1965 -66 సంవత్సరం పహానిలో 22 ఎకరాల 8 గుంటల భూమి ఉంది. తర్వాత 2000-01 పహానిలో 650 సర్వేలో 22 ఎకరాల 8 గుంటల భూమి ఉంది. 2021 సంవత్సరం వచ్చేనాటికి 33 ఎకరాల 26 గుంటలకు ఎలా పెరిగింది. 16 ఎకరాలు మల్లారెడ్డి బామ్మర్ది శ్రీనివాస్ రెడ్డి మీదకు బదిలీ అయ్యింది. శ్రీనివాస్రెడ్డి నుంచి మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి గిఫ్ట్ డీడ్ చేశారు. అసలు ఆ 16 ఎకరాల భూమికి శ్రీనివాస్రెడ్డి ఎలా ఓనర్ అయ్యారు. అదే భూమిని 2004లో లే ఔట్ చేసి ప్లాట్స్గా అమ్మారు. 2012లో మళ్ళీ హెచ్ఎండీఏ లే ఔట్ చేసి అమ్మేశారు. సర్వే నెంబర్ 650లోని 22 ఎకరాల 8 గుంటల భూమి.. ధరణి పోర్టల్లో 33 ఎకరాల 26 గుంటలకు ఎలా పెరిగింది. అందులో 16ఎకరాలు శ్రీనివాస్ రెడ్డి మీదకు ఎలా మారింది. ఆ 16 ఎకరాల స్థలంలో యూనివర్సిటీకి అనుమతులు ఎలా తెచ్చారు’’ అని రేవంత్రెడ్డి ప్రశ్నించారు.
జవహర్నగర్లో 488సర్వేలోని 5ఎకరాల భూమిని ప్రభుత్వం ప్రొహిబిటెడ్ జాబితాలో పెట్టిందని, ఈ భూమి మల్లారెడ్డి కోడలు షాలినిరెడ్డి పేరు మీద సేల్ డీడ్ ఎలా అయిందని తెలిపారు. అక్కడ సీఎంఆర్ హాస్పిటల్ ఎలా నడుపుతున్నారని నిలదీశారు. ప్రభుత్వ భూముల్లో భవన నిర్మాణాలకు అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఇంజినీరింగ్ కాలేజ్కు గ్రేడింగ్ కోసం తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారని, మల్లారెడ్డి కాలేజ్లను న్యాక్ ఐదేళ్లు నిషేధించిందని గుర్తుచేశారు. న్యాక్ నిషేధించిన మల్లారెడ్డి కాలేజ్లకు యూనివర్సిటీ అనుమతి ఎలా ఇస్తారని రేవంత్రెడ్డి నిలదీశారు.