టీఎంసీ నిరసనలపై స్పందించిన బెంగాల్ గవర్నర్
ABN , First Publish Date - 2021-05-17T19:45:19+05:30 IST
నగరంలోని సీబీఐ ఆఫీసు దగ్గర టీఎంసీ కార్యకర్తల నిరసనలపై రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్ఖర్ స్పందించారు. సీబీఐ కార్యాలయంపై...
కోల్కతా: నగరంలోని సీబీఐ ఆఫీసు దగ్గర టీఎంసీ కార్యకర్తల నిరసనలపై రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్ఖర్ స్పందించారు. సీబీఐ కార్యాలయంపై రాళ్ల దాడిని ఆయన ఖండించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకుల్లా నిలిచిపోయారని వ్యాఖ్యానించారు. అక్కడి శాంతిభద్రతలను పునరుద్దరించాల్సిందిగా పోలీసులను గవర్నర్ కోరారు.
ఇదిలా ఉంటే, ఇటీవల జరిగిన నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో అధికార పార్టీకి చెందిన మంత్రిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు టీఎంసీ కార్యకర్తలు కూడా సీబీఐ ఆఫీసు ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఓటమిని జీర్ణించుకోలేకపోతోందని, అందుకే తమ నేతలను అరెస్టు చేసి పగ తీర్చుకుంటోందని టీఎంసీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మంత్రి ఫిర్హాద్ హకీంను, ఇతర నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది టీఎంసీ కార్యకర్తలు రాళ్లదాడి చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది.