మళ్లీ కూతురు పుట్టిందని కసాయి భర్త ఏం చేశాడంటే...
ABN , First Publish Date - 2021-06-07T13:32:06+05:30 IST
రెండవసారి కూడా ఆడపిల్ల పుట్టిందనే కోపంతో భార్య, ఇద్దరు కుమార్తెలను బావిలోకి నెట్టి పారిపోయిన....
భోపాల్ (మధ్యప్రదేశ్): రెండవసారి కూడా ఆడపిల్ల పుట్టిందనే కోపంతో భార్య, ఇద్దరు కుమార్తెలను బావిలోకి నెట్టి పారిపోయిన కసాయి భర్త ఉదంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛతర్ పూర్ సమీపంలోని పడోయ్ గ్రామంలో జరిగింది. రాజాభయ్య యాదవ్ భార్యకు రెండవసారి కూడా కుమార్తె జన్మించింది. రాజా యాదవ్ తన పొరుగున ఉన్న పన్నా జిల్లాలోని అత్తమామల ఇంటి నుంచి భార్య, ఇద్దరు కుమార్తెలను తీసుకొని ఇంటికి తిరిగి వస్తూ పడోయ్ గ్రామంలోని బావి వద్ద మోటారు సైకిలు ఆపాడు. తన భార్య వరుసగా ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిందనే కోపంతో రాజాయాదవ్ భార్య, ఇద్దరు ఆడపిల్లలను బావిలోకి నెట్టాడు.
భార్య బావి నుంచి పైకి వచ్చేందుకు ప్రయత్నిస్తుండటంతో బావిలో పడిన ఆమెపై రాళ్లు విసిరాడు. బావిలో తల్లీ పిల్లల ఆక్రందనలు విన్న గ్రామస్థులు వచ్చి తల్లీ, మూడునెలల చిన్నారిని రక్షించారు. బావిలో తోసిన ఈ ఘటనలో 8 ఏళ్ల చిన్నారి మరణించింది. మళ్లీ కుమార్తె జన్మించడంతో తనపై కోపంతో భర్త తమను బావిలోకి నెట్టాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య పిల్లలను బావిలోకి నెట్టిన కసాయి భర్త రాజా యాదవ్ పారిపోయాడు. దీంతో పోలీసులు అతనిపై హత్య, హత్యాయత్నం కేసులు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు.