విదేశీయుడికి భారీ షాక్.. మాస్కు పెట్టుకోలేదని..
ABN , First Publish Date - 2021-08-08T01:14:46+05:30 IST
పొరుగు దేశంలో ఉంటూ కరోనా నిబంధనలు పాటించని ఓ విదేశీయుడికి భారీ షాక్ తగిలింది.
ఇంటర్నెట్ డెస్క్: పొరుగు దేశంలో ఉంటూ కరోనా నిబంధనలు పాటించని ఓ విదేశీయుడికి భారీ షాక్ తగిలింది. మాస్క్ పెట్టుకోనంటున్న అతడిని పిచ్చాస్పత్రిలో చేర్చాలంటూ కోర్టు ఆదేశించింది. సింగపూర్లో ఇటీవల ఈ ఘటన జరిగింది. బ్రిటీష్ జాతీయుడు బెంజమిన్ గ్లిన్ వృత్తి రీత్యా గత మూడేళ్లుగా సింగపూర్లో నివసిస్తున్నాడు. అయితే.. మే నెలలో మెట్రోలో ప్రయాణిస్తున్న సమయంలో అతడు మాస్కు పెట్టుకోలేదు. దీన్ని తోటి ప్రయాణికుడు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విషయం అధికారుల దృష్టికెళ్లడంతో కొద్ది గంటల్లోనే వారు బెంజమిన్ జాడ కనుక్కుని అతడిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో విషయం కోర్టు పరిధిలోకి వెళ్లింది. ఈ కేసులో విచారణ చేపట్టిన కోర్టు బెంజమిన్ను మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలని తాజాగా ఆదేశించింది. మాస్క్ వల్ల ఉపయోగం లేదంటూ అతడు విచారణ సందర్భంగా మొండిపట్టు పట్టాడు. దీంతో.. అతడి మానసిక స్థితిని అంచనా వేసేందుకు మెంటల్ ఆస్పత్రికి తరలించాలని గురువారం నాడు కోర్టు అధికారులను ఆదేశించింది.