కార్లను అద్దెకు తీసుకొని మోసం.. వ్యక్తి అరెస్టు
ABN , First Publish Date - 2020-12-25T13:29:17+05:30 IST
అద్దెకు కార్లు తీసుకొని మోసాలకు పాల్పడే ఓ వ్యక్తిని కేపీహెచ్బీ పోలీసులు
- నాలుగు కార్లు స్వాధీనం
హైదరాబాద్/హైదర్నగర్ : అద్దెకు కార్లు తీసుకొని మోసాలకు పాల్పడే ఓ వ్యక్తిని కేపీహెచ్బీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. కూకట్పల్లి ఏసీపీ సురేందర్రావు తెలిపిన వివరాల ప్రకారం.... నల్గొండ జిల్లా పోచంపల్లి గ్రామానికి చెందిన వినోద్కుమార్రెడ్డి(23) నగరంలోని బీహెచ్ఈఎల్ ప్రాంతంలో నివాసముంటూ ట్రావెల్స్ వ్యాపారం నిర్వహిస్తుంటాడు. మాదాపూర్లోని అయ్యప్పసొసైటీ, మూసాపేట ప్రాంతాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేశాడు. కార్లను నెలవారీగా అద్దెకు తీసుకొని తిప్పుతానని యజమానులను నమ్మించాడు. ముగ్గురు యజమానుల నుంచి నాలుగు కార్లు అద్దెకు తీసుకొన్నాడు.
మొదటి రెండు నెలలు అద్దె సరిగ్గానే చెల్లించాడు. గత రెండు నెలలుగా అద్దె చెల్లించకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. వినోద్కుమార్ అద్దెకు తీసుకున్న కార్లను తాకట్టు పెట్టి డబ్బు తీసుకొనేవాడు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు. విషయం తెలుసుకొన్న బాధితులు కేపీహెచ్బీ పీఎ్సలో రెండు, ఆర్సీపురం పీఎ్సలో ఒక కేసు చొప్పున ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన కేపీహెచ్బీ పోలీసులు నిందితుడు వినోద్కుమార్ను గురువారం అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి నాలుగు కార్లు స్వాధీనం చేసుకున్నారు.