8 నెలల క్రితం జరిగిన ఘటన.. తాజాగా వెలుగులోకి వచ్చి వైరల్ అయిన వీడియో!
ABN , First Publish Date - 2020-02-23T02:41:30+05:30 IST
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లోని కల్లుగర్హి గ్రామంలో జరిగిన దారుణ ఘటన ఒకటి ఎనిమిది నెలల
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లోని కల్లుగర్హి గ్రామంలో జరిగిన దారుణ ఘటన ఒకటి ఎనిమిది నెలల తర్వాత బయటకు వచ్చి సంచలనమైంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో స్పందించిన పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. గతేడాది మేలో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తిని చితకబాదిన నిందితులు అతడి మెడకు తాడుకట్టి కుక్కలా ఈడ్చుకెళ్లారు. అంతటితో ఆగక కుక్కలా అరవాలంటూ కర్రలతో చావబాదడం వీడియోలో కనిపిస్తోంది.
బాధితుడు ఇక్రముద్దీన్ 8 ఫిబ్రవరి 2018లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. నాలుగు రోజుల తర్వాత వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్నాడు. అతడి పొరుగింట్లో ఉండే భార్య కుటుంబ సభ్యులు గతేడాది మే
16న ఇక్రముద్దీన్ను కిడ్నాప్ చేసి కర్రలతో విచక్షణ రహితంగా దాడిచేశారు. వారి దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడు అదే నెల 16-20 మధ్య ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి తనపై జరిగిన దాడి గురించి ఫిర్యాదు చేశాడు. అయితే, పోలీసులు చెప్పింది విని ఆశ్చర్యపోయాడు.
భార్యపై అత్యాచారం చేసినట్టు మే 17న అతడిపై కేసు నమోదైందని చెప్పిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల బెయిలుపై విడుదలైన ఇక్రముద్దీన్ మరోమారు పోలీసులను
ఆశ్రయించి తనకు జరిగిన దారుణం గురించి ఏకరువు పెట్టాడు. తనను కిడ్నాప్ చేసిన నిందితులు తనను దారుణంగా హింసించారని, మెడకు తాడుకట్టి కుక్కలా ఈడ్చుకెళ్లారని ఆవేదన వ్యక్తం
చేశాడు. అంతేకాదు, కుక్కలా అరవాలంటూ ఒత్తిడి తీసుకొచ్చారని పేర్కొన్నాడు. బెయిలుపై విడుదలైన తర్వాత కూడా తనకు వారి నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నాడు. అదే సమయంలో వీడియో కూడా బయటకు రావడంతో సంచలనమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.