అతిమధురాన్ని అతిగా తీసుకోవడంతో.. అమెరికాలో..

ABN , First Publish Date - 2020-09-25T08:12:29+05:30 IST

అతిమధురాన్ని(బ్లాక్ లికోరైస్) ఎక్కువగా తినడంతో అమెరికాలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్టు

అతిమధురాన్ని అతిగా తీసుకోవడంతో.. అమెరికాలో..

మశాచూసెట్స్: అతిమధురాన్ని(బ్లాక్ లికోరైస్) ఎక్కువగా తినడంతో అమెరికాలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటన గతేడాది జరిగినప్పటికి తాజాగా వెలుగులోకి వచ్చింది. మశాచూసెట్స్‌లో కన్‌స్ట్రక్షన్ వర్కర్‌గా పనిచేసిన 54 ఏళ్ల వ్యక్తి నిత్యం దాదాపు రెండు బ్యాగుల అతిమధురాన్ని తింటూ వచ్చాడు. దీంతో కొద్ది వారాల్లోనే అతడి పోషకాలు దెబ్బతిన్నాయి. ఫలితంగా అతడి గుండె కొట్టుకోవడం ఆగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాధితుడు ఓ ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్‌లో లంచ్‌ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా.. పొటాషియం తక్కువగా ఉండటంతో బాధితుడు హార్ట్ రిథమ్(గుండె అతివేగంగా లేదా అతినెమ్మదిగా కొట్టుకోవడం)తో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. 


వైద్యులు వెంటనే సీపీఆర్ నిర్వహించగా బాధితుడు కళ్లు తెరిచాడు. కానీ మరుసటి రోజు గుండె కొట్టుకోవడం ఆగిపోవడంతో బాధితుడు మరణించాడు. అతిమధురంలోని గ్లిసోరైజిక్ అనే కెమికల్ శరీరంలోని పొటాషియంను దెబ్బతీస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల మనిషి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందని తెలిపారు. అతిమధురాన్ని తక్కువగా తిన్నా బీపీ పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అతిమధురాన్ని నిత్యం 50 గ్రాముల కంటే ఎక్కువగా తీసుకుంటే రెండు వారాల్లోనే హార్ట్ రిథమ్ సమస్యలు వస్తాయని యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) హెచ్చరిస్తోంది. ముఖ్యంగా 40కు పైబడిన వారిపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. కాగా.. అతిమధురాన్ని అత్యంత శక్తిమంతమైన మూలికగా ఆయుర్వేదం చెబుతోంది. అనేక ఉత్పత్తుల్లో అతిమధురాన్ని వాడుతుంటారు.

Updated Date - 2020-09-25T08:12:29+05:30 IST