T20: పాకిస్థాన్‌కు భార్య మద్దతు... FIR ఫైల్ చేసిన భర్త

ABN , First Publish Date - 2021-11-07T21:38:01+05:30 IST

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబరు 24న భారత్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ భారీ ఘన విజయం సాధించింది

T20: పాకిస్థాన్‌కు భార్య మద్దతు... FIR ఫైల్ చేసిన భర్త

న్యూఢిల్లీ: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబరు 24న భారత్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. భారత్ ఓటమిని సెలబ్రేట్ చేసుకుంటూ ఓ ఇల్లాలు చేసిన  పని ఆమె కాపురంలో చిచ్చు రాజేసింది. తన భార్య పాకిస్థాన్‌కు మద్దతు పలకడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆమె భర్త తాజాగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భార్యపై ఫిర్యాదు చేశాడు.


ఉత్తరప్రదేశ్‌లో జరిగిందీ ఘటన. రాంపూర్‌ జిల్లాలోని అజీమ్‌ నగర్‌కు చెందిన ఇషాన్ మియా-రబియా షంషీ భార్యాభర్తలు. పాకిస్థాన్ చేతిలో భారత్ ఓడిపోయిన వెంటనే రబియా, ఆమె కుటుంబ సభ్యులు టపాకాయలు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. అంతటితో ఆగక వాట్సాప్ స్టేటస్‌లోనూ వారి ఆనందాన్ని పంచుకున్నారు. ఇషాన్ ఫిర్యాదుపై రబియా షంషీ, ఆమె కుటుంబ సభ్యులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 


ఆ రోజు భారత జట్టు ఓటమి తర్వాత ఆగ్రా, జమ్మూకశ్మీర్‌లోనూ ఇలాంటి ఘటనలే జరిగాయి. కోహ్లీ సేన ఓటమితో సంబరాలు చేసుకున్న కశ్మీర్‌లోని కొందరు వ్యక్తులు పాక్ అనుకూల నినాదాలు కూడా చేసినట్టు కేసు నమోదైంది. పాక్ విజయాన్ని శ్రీనగర్‌లో సెలబ్రేట్ చేసుకున్న కశ్మీర్‌కు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి సోషల్ మీడియా పోస్టులు విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆగ్రాలో ఇంజినీరింగ్ చదువుతున్న ముగ్గురు కశ్మీరీ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.  

Updated Date - 2021-11-07T21:38:01+05:30 IST