సీటు మహిళలకు రిజర్వ్ చేయడంతో పెళ్లి పీటలు ఎక్కాడు...

ABN , First Publish Date - 2021-03-31T19:08:04+05:30 IST

కల్యాణ ఘడియ వస్తే ఆగదంటారు. పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మంచి ముహూర్తం అని కూడా చూడకుండా..

సీటు మహిళలకు రిజర్వ్ చేయడంతో పెళ్లి పీటలు ఎక్కాడు...

బల్లియా: కల్యాణ ఘడియ వస్తే ఆగదంటారు. పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మంచి  ముహూర్తం అని కూడా చూడకుండా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి హడావిడిగా పెళ్లిపీటలు ఎక్కేసాడు. ఎన్నికలకూ, పెళ్లికి సంబంధం ఏమిటంటారా? ఇక్కడే ఉంది కీలకమంతా. బల్లియా జిల్లా కరణ్ ఛాప్రా గ్రామానికి చెందిన 45 ఏళ్ల హాథీ సింగ్ ఓ దశాబ్దంగా సామాజిక సేవ చేస్తున్నాడు. గ్రామపెద్ద కావాలన్నదే అతని చిరకాల కోరిక. 2015లో తన అదృష్టం పరీక్షించుకునేందుకు పంచాయతీ ఎన్నికల్లో తన గ్రామం నుంచి నిలబడ్డాడు. అయితే రన్నరప్‌గానే మిగిలిపోయాడు. ఎప్పటికైనా తన కోరిక నెరవేరుతుందని ఆశించిన హధీ సింగ్‌కు ఈ మధ్య ఊహించని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పోటీ చేయాలనుకుంటున్న సీటును మహిళలకు రిజర్వ్ చేశారు. దీంతో ఎలాగైనా ఈసారి ఎన్నికల్లో గెలవాలన్న అతని ఆశలు చెల్లచెదురయ్యాయి.


ఈ సమయంలోనే మిత్రులంతా కలిసి పెళ్లి ప్రతిపాదన చేశారు. పెళ్లి చేసుకుంటే ఆమెను ఎన్నికల్లోకి దించవచ్చంటూ సలహా పడేశారు. ఆ సలహా నచ్చిందో ఏమో? వెంటనే పెళ్లి పీటలు ఎక్కేశాడు. ఈనెల 26న తన గ్రామంలోని థర్మనాథ్‌జీ ఆలయంలో బాజాభజంత్రీలు మోగాయి. నిజానికి హిందూ సంప్రదాయం ప్రకారం 'ఖర్-మాస్'లో పెళ్లి శుభప్రదం కాదు. ఇవేమీ తన లక్ష్యానికి అడ్డుకావని హాధీ సింగ్ చెప్పాడు. "ఏప్రిల్ 13న నామినేషన్ల గడువుకు ముందుకు నేను పెళ్లి చేసుకోవాలి ఉంది. చేసుకున్నాను. అంతే.."అంటూ నూతన వధువుతో కలిసి ముసిముసి నవ్వులు నవ్వాడు హాధీ సింగ్. శ్రీమతి హాథీ సింగ్ ప్రస్తుతం గ్యాడ్యుయేషన్ చదువుతోంది. భర్త కోరిక మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీకి 'సై' అంటోంది.

Updated Date - 2021-03-31T19:08:04+05:30 IST