వివాహేతర సంబంధం ఉందని అనుమానం.. భార్యను దారుణంగా చంపేసిన భర్త

ABN , First Publish Date - 2021-01-16T03:22:11+05:30 IST

భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అనుమానించిన భర్త ఆమెను అత్యంత దారుణంగా

వివాహేతర సంబంధం ఉందని అనుమానం.. భార్యను దారుణంగా చంపేసిన భర్త

న్యూఢిల్లీ: భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అనుమానించిన భర్త ఆమెను అత్యంత దారుణంగా అంతమొందించాడు. వాయవ్య ఢిల్లీలోని బల్జీత్ విహార్ ప్రాంతంలో జరిగిందీ ఘటన. నిందితుడు సోహన్ చౌరాసియాను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 4న చావ్లా తేజ్‌పూర్ రోడ్డు పక్కనున్న పొదల్లో ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమెను గొంతు కోసి చంపినట్టు పోలీసులు నిర్ధారించారు. అమన్ విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బల్జీత్ విహార్ ప్రాంతంలో ఓ మహిళ అదృశ్యమైనట్టు సోమవారం పోలీసులు సమాచారం అందుకున్నారు. 


అదృశ్యమైన మహిళ వివరాలు తమకు లభ్యమైన మహిళ మృతదేహం వివరాలతో సరిపోలినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. బల్జీత్ విహార్‌లోని మహిళ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆమె కుమారుడు శివంను ఆసుపత్రికి తీసుకెళ్లి మృతదేహాన్ని చూపించారు. ఆమెను చూసి శివం బోరుమన్నాడు. ఆమె తన తల్లి సరస్వతి అని చెప్పాడు. అయితే, భర్త సోహన్ కనిపించకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది.


దీంతో అతడి కోసం గాలింపు మొదలుపెట్టిన పోలీసులు తాజాగా సోహన్‌ను అరెస్ట్ చేశారు. ఆమెను తానే చంపినట్టు దర్యాప్తులో వెల్లడించాడు. తమతో రెండేళ్లుగా కలిసి ఉంటున్న చందన్ అనే వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఉండడంతోనే ఆమెను చంపేసినట్టు వివరించాడు. మార్కెట్‌కు, అక్కడి నుంచి వికాశ్ విహార్ నాలా వద్దకు వెళ్దామని నమ్మించి ఈ నెల 3న భార్యను తీసుకుని సోహన్ కారులో బయలుదేరాడు. అనంతరం ఆమె మెడను ప్లాస్టిక్ తాడుతో బిగించి, ఆపై కత్తితో గొంతు కోసి చంపేశాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత మృతదేహాన్ని తేజ్‌పూర్ చావ్లా రోడ్డు పక్కనున్న పొదల్లో పడేసినట్టు పేర్కొన్నారు.

Updated Date - 2021-01-16T03:22:11+05:30 IST