కుమార్తె ప్రేమిస్తున్న యువకుడి కుటుంబంపై కాల్పులు.. నలుగురి మృతి

ABN , First Publish Date - 2021-07-05T00:13:15+05:30 IST

కుమార్తె ప్రేమిస్తున్న యువకుడి కుటుంబంపై కాల్పులు.. నలుగురి మృతి

కుమార్తె ప్రేమిస్తున్న యువకుడి కుటుంబంపై కాల్పులు.. నలుగురి మృతి

చండీగఢ్: పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో దారుణం జరిగింది. తన కుమార్తెను ప్రేమిస్తున్నాడన్న కక్షతో యువకుడి కుటుంబంలోని నలుగురిని దారుణంగా మట్టబెట్టాడు యువతి తండ్రి. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాట్లాలోని బలార్వాల్ గ్రామానికి చెందిన సుఖ్జీందర్ సింగ్ కుమార్తె అదే గ్రామానికి చెందిన జెర్మన్‌జీత్ సింగ్‌ను ప్రేమిస్తోంది. విషయం తెలిసిన సుఖ్జీందర్ ఈ ఉదయం జెర్మన్‌జీత్ సింగ్ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ జెర్మన్ జీత్‌తోపాటు అతడి తండ్రి సుఖ్విందర్ సింగ్ ఉన్నారు. 


తన కుమార్తెతో ప్రేమ విషయాన్ని వారి వద్ద ప్రస్తావించిన సుఖ్జీందర్ సింగ్ ఆగ్రహంతో ఊగిపోయాడు. ఈ క్రమంలో వాగ్వివాదం మరింత పెద్దది కావడంతో రెచ్చిపోయిన సుఖ్జీందర్ తుపాకితో వారిపై కాల్పులు జరిపాడు. కాల్పుల్లో సుఖ్విందర్ అక్కడికక్కడే మరణించాడు. జెర్మన్‌జీత్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలిసిన జెర్మన్‌జీత్ తాత మంగళ్ సింగ్, అంకుల్ జస్బీర్ సింగ్, కజిన్ బబన్‌దీప్, బంధువు జాషన్ అక్కడికి చేరుకున్నారు. నిందితుడు సుఖ్జీందర్ సింగ్ వారిపైనా కాల్పులు జరపడంతో మంగళ్ సింగ్, జస్బీర్ సింగ్, బబన్‌దీప్‌లు మరణించారు. తీవ్రంగా గాయపడిన జెర్మన్‌జీత్ సింగ్, జాషన్‌లు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్టు పోలీసులు తెలిపారు. సుఖ్జీందర్ సింగ్ పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.  

Updated Date - 2021-07-05T00:13:15+05:30 IST