భార్య కళ్లెదుటే దారుణం...

ABN , First Publish Date - 2021-06-01T17:03:33+05:30 IST

మొదటి భార్యతో విడిపోయి రెండో భార్య ఆజ్మరీతో నాలుగేళ్లుగా కలిసి ఉంటున్నాడు.

భార్య కళ్లెదుటే దారుణం...

  • మద్యం మత్తులో ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కిన వాచ్‌మన్‌ మృతి
  • ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ బలి

హైదరాబాద్ సిటీ/సైదాబాద్‌ : తాగిన మత్తులో ఓ వ్యక్తి భార్య కళ్లెదుటే విద్యుత్‌ ట్రాన్‌ఫార్మర్‌ ఎక్కి అత్మహత్య చేసుకున్నాడు. అక్బర్‌బాగ్‌లోని బషీర్‌ ఎన్‌క్లేవ్‌లో అక్బర్‌ఖాన్‌ (40) ఆరు నెలలుగా వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. మొదటి భార్యతో విడిపోయి రెండో భార్య ఆజ్మరీతో నాలుగేళ్లుగా కలిసి ఉంటున్నాడు. మొదటి భార్యకు నలుగురు పిల్లలు కాగా, రెండో భార్యకు సంతానం లేదు. కొంత కాలంగా తాగుడికి బానిసయ్యాడు. వద్దని వారిస్తే భార్యతో గొడవపడి కొట్టేవాడు. సోమవారం మధ్యాహ్నం 01.30 గంటల సమయంలో మద్యం మత్తులో ఇంటికి వచ్చిన అక్బర్‌ఖాన్‌ భార్యతో గొడవపడ్డాడు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ బయటకు పరుగులు తీశాడు. భార్య వెంటపడితే, రాయితో కొడతానని హెచ్చరిస్తూ ధిల్‌కుష్‌ ఫంక్షన్‌ హాల్‌ సమీపంలోని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి ఎక్కాడు. దిగమని భార్య ప్రాధేయపడినా వినకుండా విద్యుత్‌ తీగలు పట్టుకున్నాడు. ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు అంటుకుని పైనుంచి కిందపడిపోయాడు. తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందాడు. సైదాబాద్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-06-01T17:03:33+05:30 IST