‘ఆంజనేయస్వామి పిలిచాడు.. ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నా’

ABN , First Publish Date - 2021-07-29T14:45:53+05:30 IST

ఆంజనేయస్వామి తనను పిలిచాడని, అందుకే ఈ లోకాన్ని...

‘ఆంజనేయస్వామి పిలిచాడు.. ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నా’

హైదరాబాద్ సిటీ/కవాడిగూడ : వివాహం కాలేదని తీవ్ర మనస్తాపంతో ఓ నలభై ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఇంటినుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాంధీనగర్‌ పీఎస్‌ ఎస్‌ఐ శ్రావణ్‌కుమార్‌ వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా కొండపాక ఎర్రవెల్లి ప్రాంతానికి చెందిన పి.గోపాల్‌(40) తాళ్లబస్తీలో ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. ఆరునెలల క్రితం గోపాల్‌ తమ్ముడు పి.రవి(37)కి వివాహం జరిగింది. అంతకు ముందు అన్నదమ్ములు కవాడిగూడలోనే కలిసి ఉండేవారు. రవి తన భార్యతో కలిసి రామంతపూర్‌లో నివాసం ఉంటున్నారు. గత ఆదివారం ఉదయం గోపాల్‌ను తమ్ముడు కలిసేందుకు వస్తే యోగాచేస్తూ కనిపించాడు.


అదే రోజు రాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆరోజు నుంచి ఇంటితలుపు మూసి ఉంది. బుధవారం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు  గోపాల్‌ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మూడు రోజుల క్రితం చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. క్లూస్‌ టీం సిబ్బంది  వివరాలు సేకరించారు. రూంలో సూసైడ్‌ నోట్‌ లభించింది. అందులో ఆంజనేయస్వామి తనను పిలిచాడని, అందుకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నట్టు రాసి ఉందని పోలీసులు తెలిపారు. సోదరుడికి పోలీసులు సమాచారం అందించారు. రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-07-29T14:45:53+05:30 IST