ఆ ఒక్కడి కారణంగా 23 మందికి వైరస్..
ABN , First Publish Date - 2020-03-27T23:43:20+05:30 IST
పంజాబ్లో నమోదైన 33 కరోనా పాజిటివ్ కేసుల్లో 23 కేసులు తొలి మృతుడి నుంచి సంక్రమించినట్టుగా అనుమానిస్తున్నారు. బాధితులలో మృతుడి ఇద్దరి కుమార్తెలు..
ఛండీగఢ్: పంజాబ్లో నమోదైన 33 కరోనా పాజిటివ్ కేసుల్లో 23 కేసులు తొలి మృతుడి నుంచి సంక్రమించినట్టుగా అనుమానిస్తున్నారు. బాధితులలో మృతుడి ఇద్దరి కుమార్తెలు, ముగ్గురు కుమారులు, ఇద్దరు కోడళ్లు, ఏడుగురు మనుమలు కూడా ఉన్నారు.
గురుద్వారా బోధకుడుగా ఉన్న 70 ఏళ్ల కరోనా మృతుడు, కొద్దిరోజుల క్రితం జర్మనీ, ఇటలీలో పర్యటించారు. మార్చి 7న న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. అదే రోజు పంజాబ్కు చేరుకున్నారు. సెల్ఫ్ క్వారంటైన్కు వెళ్లడానికి బదులు పలువురు వ్యక్తులను కలుసుకున్నారు. మార్చి 8 నుంచి 10 వరకూ ఆనంద్పురి సాహిబ్లో జరిగిన హోలా మొహల్లా ఉత్సవంలో పాల్గొన్నారు. అనంతరం తాను గురుద్వారా బోధకుడుగా ఉన్న షహీద్ భగత్ సింగ్ నగర్ జిల్లా ఫథలావా గ్రామానికి చేరుకున్నారు. తనకు కోవిడ్-19 వచ్చినట్టు మార్చి 18న పరీక్షల్లో తేలే సమయానికి అప్పటికే సుమారు 100 మందిని ఆయన కలుసుకున్నారు. ఆయన, ఆయనతో పాటే ఉన్న మరో ఇద్దరు కూడా రాష్ట్రవ్యాప్తంగా 15 గ్రామాల్లో పర్యటించినట్టు చెబుతున్నారు. ఆయా గ్రామాలకు చెందిన పేషంట్ల నుంచి ఇతరులకు కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ యంత్రాగం ఆ గ్రామాలను సీల్ చేసినట్టు ఎస్బీఎస్ నగర్ డిప్యూటీ కమిషనర్ వినయ్ బుబ్లాని తెలిపారు.