గర్ల్ఫ్రెండ్ను కలవాలంటూ నెటిజన్ ట్వీట్.. వైరల్ అవుతున్న ఢిల్లీ మెట్రో రిప్లై
ABN , First Publish Date - 2021-06-12T01:22:24+05:30 IST
లాక్డౌన్ నేపథ్యంలో ఓ నెటిజన్ చాలా రోజులుగా గర్ల్ ఫ్రెండ్ను కలవలేదు. తాజాగా లాక్డౌన్ నిబంధనలను సడలించడంతో వెంటనే..
ఇంటర్నెట్ డెస్క్: లాక్డౌన్ నేపథ్యంలో ఓ నెటిజన్ చాలా రోజులుగా గర్ల్ ఫ్రెండ్ను కలవలేదు. తాజాగా లాక్డౌన్ నిబంధనలను సడలించడంతో వెంటనే వెళ్లి ఆమెను కలవాలనుకున్నాడు. కానీ ఆమెను కలవాలంటే మెట్రోలో వెళ్లాలి. అయితే వారాంతంలో మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయో లేవో అతడికి తెలియలేదు. దీంతో ట్విటర్ వేదికగా.. తన డౌట్ను పంచుకున్నాడు. ఢిల్లీ మెట్రో యాజమాన్యాన్ని ట్యాగ్ చేస్తూ.. ‘వారాంతంలో మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయా లేదా..? దయచేసి చెప్పండి. గర్ల్ ఫ్రెండ్ను కలవాలి. లేకపోతే కచ్చితంగా బ్రేక్ అప్ చెప్పేస్తుంది. ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశాడు.
అతడి ట్వీట్కు ఢిల్లీ మెట్రో కూడా తన స్టైల్లో ఓ చిన్న వీడియో క్లిప్ను రీట్వీట్ చేస్తూ రిప్లై ఇచ్చింది. ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమా క్లైమ్యాక్స్లో అమ్రీష్పూరికి సంబంధించిన ఆ క్లిప్ను షేర్ చూసి.. ‘పనిచేస్తోంది మిత్రమా. వెళ్లు.. వెళ్లి నీ జీవితం నువ్వు జీవించు’ అంటూ ఆ సీన్లో అమ్రీష్ పూరి చెప్పే డైలాగ్ టైప్లోనే ఓ కామెంట్ కూడా చేసింది. దీంతో ఆ నెటిజన్ చేసిన ట్వీట్.. దానికి ఢిల్లీ మెట్రో ఇచ్చిన రిప్లై ప్రస్తుతం సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది.