ఎస్సీ వర్గీకరణపై సీఎం స్పందించాలి: మంద కృష్ణమాదిగ
ABN , First Publish Date - 2020-09-28T21:03:20+05:30 IST
ఎస్సీ వర్గీకరణ విషయంలో సీఎం జగన్ స్పందించాలని ఎమ్మార్పీఎస్ జాతీయ వ్యవస్థాపక..
ఎచ్చెర్ల(శ్రీకాకుళం): ఎస్సీ వర్గీకరణ విషయంలో సీఎం జగన్ స్పందించాలని ఎమ్మార్పీఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. జిల్లా పర్యటనకు ఆదివారం వచ్చిన ఆయన చిలకపాలెం వద్ద విలేకర్లతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో నియామకమైన ఉషా మెహర కమిటీ ఎస్సీ వర్గీకకరణకు అనుకూలంగా నివేదిక ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. కమిటీ నివేదిక మేరకు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని అప్పట్లో వైఎస్ కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారన్నారు. ఇంతలో వైఎస్ దుర్మరణం చెందా రన్నారు. అప్పటి నుంచి వర్గీకరణ బిల్లు పెండింగ్లో ఉన్నట్టు చెప్పారు.
ఇటీవల పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణపై దేశంలో ఏడు రాష్ట్రాలు అనుకూలంగా ఉన్నాయని, ఇందులో ఆంధ్రపదేశ్ కూడా ఉన్నట్టు వెల్లడించారన్నారు. 2004లో వైఎస్ చేసిన అసెంబ్లీలో తీర్మానం మేరకు కేంద్ర ప్రకటన వెలువడిందని చెప్పారు. తండ్రి వైఎస్ అడుగుజాడలో తనయుడు జగన్ నడవాలని.. వర్గీకరణకు అనుకూలంగా ప్రకటన చేయాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాల ఇష్టమేనని సుప్రీంకోర్టు ఈ ఏడాది ఆగస్టు 27న తీర్పునిచ్చిందన్నారు.నెలరోజులవుతున్నా ఇప్పటికీ సీఎం జగన్ స్పందించలేదన్నారు. ఈ విషయమై సీఎం మౌన ం వీడాలని కోరారు. దళితులపై పెరుగుతున్న దాడులు హత్యలు, అత్యాచారాలపై జాతీయ స్థాయిలో ఉద్యమం చేపడతామన్నారు.