వాడీవేడిగా మండల సర్వసభ్య సమావేశం
ABN , First Publish Date - 2021-06-18T04:21:28+05:30 IST
వాడీవేడిగా మండల సర్వసభ్య సమావేశం
- భూ ఆక్రమణలపై సభ్యుల ఆగ్రహం
కడ్తాల్ : ప్రభుత్వ భూముల ఆక్రమణల విషయంలో అధికారుల నిర్లక్ష్యంపై మండల సభలో సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కోట్ల రూపాయల విలువ చేసే వందల ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్, శిఖం భూములు కొందరు రియల్టర్లు కబ్జా చేసినా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని వారు ప్రశ్నించారు. మండల సర్వసభ్య సమావేశం గురువారం ఎంపీపీ కమ్లీమోత్యనాయక్ అధ్యక్షతన జరిగింది. సమావేశం ప్రారంభం కాగానే ఎంపీటీసీ శ్రీనివా్సరెడ్డి సూచన మేరకు కరోనా మృతులకు సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. కడ్తాలలో పలువురు రియాల్టర్లు వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని వ్యాపారం చేస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎంపీటీసీ శ్రీనివా్సరెడ్డి, వైస్ ఎంపీపీ ఆనంద్, కో-ఆప్షన్ సభ్యుడు జహంగీర్బాబా సభలో ధ్వజమెత్తారు. మైసిగండి శివాలయం సమీపంలో సత్యన్న కుంట చెరువు శిఖం భూమి రెండు ఎకరాలు కొందరు ఆక్రమించి ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారని సర్పంచ్ తులసీరామ్ నాయక్ సభ దృష్టికి తెచ్చారు. భూ ఆక్రమణల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని సర్వే నిర్వహించి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ మహేందర్రెడ్డి వివరణ ఇచ్చారు. పీఏసీఎస్ గోదాం నిర్మాణానికి స్థలం కేటాయించాలని చైర్మన్ గంప వెంకటేశ్ కోరారు. అనంతరం పలు సమస్యలపై చర్చించారు. సమావేశంలో ఎంపీటీసీలు నిర్మలాదేవి, మంజుల , అధికారులు వెంకట్ రెడ్డి, అజీమ్, సక్కుబాయి, తిరుపతయ్య, శ్రీధర్, సర్ధార్ నాయక్, రాజేశ్వరి, విజయ్కుమార్, వాగ్దేవి, సృజన, వేణుకుమార్, తదితరులు పాల్గొన్నారు.