అర్ధరాత్రి హత్య చేసిన ఘటనలో కొత్తకోణాలు?

ABN , First Publish Date - 2021-03-19T17:58:32+05:30 IST

మంగళ్‌హాట్‌లో బుధవారం అర్ధరాత్రి యువకుడిని దారుణంగా హత్య చేసిన

అర్ధరాత్రి హత్య చేసిన ఘటనలో కొత్తకోణాలు?

  • నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు 
  • రాడ్డుతో తలపై బాదడంతో పాటు, 
  • కత్తులతో పొడిచినట్లు నిర్ధారణ
  • ఉస్మానియా మార్చురీలో పోస్ట్‌ మార్టం పూర్తి

హైదరాబాద్/మంగళ్‌హాట్‌ : మంగళ్‌హాట్‌లో బుధవారం అర్ధరాత్రి యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటనలో అనేక కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతుడి స్నేహితులే అతడిని మట్టుబెట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. మల్లేపల్లి ప్రాంతానికి చెందిన నరేష్‌(25) అనే యువకుడిని ఈ నెల 17న అర్ధరాత్రి 12 గంటల తరువాత మంగళ్‌హాట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఇందిరానగర్‌లో హత్య చేసిన విషయం తెలిసిందే. కాగా నరేష్‌ మృతదేహానికి పోలీసులు గురువారం ఉస్మానియా మార్చురీలో పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించగా అతడి శరీరంపై దాదాపు ఆరు చోట్ల కత్తిపోట్లు, తలపై రాడ్డుతో విచక్షణా రహితంగా కొట్టినట్లు వైద్యులు గుర్తించారు. మృతుడు గతంలో తన స్నేహితుడితో కలిసి ఓ యువకునిపై హత్యాయత్నం చేయడంతో అప్పట్లో వీరిపై ఇదే పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు ప్రస్తుతం న్యాయస్థానంలో బెంచ్‌పైకి వచ్చింది.


ఇదే విషయంలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో గురువారం అర్ధరాత్రి ఇందిరానగర్‌లో ఒకరినొకరు దూషించుకున్నట్లు తెలుస్తోంది. మృతుడు తీవ్ర స్థాయిలో దుర్భాషలాడడంతో అతని స్నేహితుడు మరో యువకుడితో కలిసి నరేష్‌ను ఒకరు రాడ్డుతో తలపై బాదగా, మరొకరు కత్తితో పొడిచినట్లు సమాచారం. దీంతో రక్తపు మడుగులో పడి ఉన్న నరేష్‌ను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే అతడు మృతి చెండడంతో క్లూస్‌ టీమ్‌ను రప్పించి ఆధారులు సేకరించి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. గురువారం ఉదయం పోస్ట్‌ మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న మంగళ్‌హాట్‌ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితులు హత్యకు వాడిన రాడ్డు, కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

Updated Date - 2021-03-19T17:58:32+05:30 IST