అడవులను జల్లెడ పడుతున్న పోలీసులు
ABN , First Publish Date - 2020-10-19T09:54:17+05:30 IST
పినపాక, కరకగూడెం మండలాల సరిహద్దు అటవీ ప్రాంతమైన ములుగు జిల్లా మంగపేట మండలం నర్సింహసాగర్ కొప్పు గుట్ట ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మృతి చెందిన సంఘటనతో ఆదివాసి గ్రామాలు
మంగపేట ఎన్కౌంటర్తో ఉల్లిక్కిపడ్డ ఆదివాసి గ్రామాలు
కరకగూడెం, అక్టోబరు 18: పినపాక, కరకగూడెం మండలాల సరిహద్దు అటవీ ప్రాంతమైన ములుగు జిల్లా మంగపేట మండలం నర్సింహసాగర్ కొప్పు గుట్ట ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మృతి చెందిన సంఘటనతో ఆదివాసి గ్రామాలు ఉలిక్కి పడ్డాయి. భద్రాద్రి జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో పోలీసులు గ్రేహౌండ్స్ బలగాలతో జల్లేడ పడుతున్నాయి. దీంతో ఆదివాసి గ్రామాల ప్రజలు ఎప్పుడు ఏమి జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. మణుగూరు సబ్ డివిజన్లని ఆళ్లపల్లి, గుండాల, కరకగూడెం, పినపాక మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంతోపాటు ములుగు జిల్లా తాడ్వాయి, ఏటూరునాగరం, మంగపేట, ముసలమ్మగుట్ట పరిసర ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల కరకగూడెం మండలంల నీలాద్రిపేట, కరకగూడెం, మణుగూరు మండలాల సరిహద్దు ప్రాంతం పల్లేతోగు ప్రాంతంలో ఎన్కౌంటర్లు జరగ్గా, గుండాల మండలంలో ఛత్తీస్గఢ్కు చెందిన ఓ మావోయిస్టు హతమైన విషయం తెలిసిందే. తిరిగి ఆదివారం మంగపేట మండలంలో జరిగిన ఎన్కౌంటర్తో పోలీసులు అప్రమత్తమై కూంబింగ్ చేపట్టారు. కరకగూడెం ఎస్ఐ ప్రవీణ్కుమార్ ఆదివాసి గ్రామాల ప్రజలతో మాట్లాడి ఎవరైన కొత్తవ్యక్తులు వస్తే తమకు సమాచారమివ్వాలని కోరారు.