26/11 పేలుళ్ల వ్యవహారంలో మన్మోహన్ మెతక వైఖరి: మనీష్ తివారీ

ABN , First Publish Date - 2021-11-23T18:15:48+05:30 IST

కాంగ్రెస్ పార్టీకి సొంత పార్టీ సీనియర్ నేత నుంచే మరోసారి ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. 26/11 ఘటన..

26/11 పేలుళ్ల వ్యవహారంలో మన్మోహన్ మెతక వైఖరి: మనీష్ తివారీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి సొంత పార్టీ సీనియర్ నేత నుంచే మరోసారి ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. 26/11 ఘటన  అనంతరం అప్పటి మన్మోహన్ సింగ్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం 'మెతక వైఖరి' ప్రదర్శించిందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఆనంద్‌పురి సాహిబ్ ఎంపీ మనీష్ తివారీ విమర్శించారు. మనీష్ తివారీ తన తాజా పుస్తకం ''10 ఫ్లాష్ పాయింట్స్, 20 ఇయర్స్-నేషనల్ సెక్యూరిటీ సిట్యుయేషన్స్ దట్ ఇంపాక్టెడ్ ఇండియా''లో ఈ వ్యాఖ్యలు చేశారు. సంయమనం పేరుతో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మెతక ధోరణి ప్రదర్శించిందని, అదెంత మాత్రం బలనిరూపణను చాటుకునే సంకేతం కాదని, బలహీనతను చాటుకునే సంకేతమని ఆయన అన్నారు. వందలాది మంది అమాయకులను ఊచకోత కోస్తున్న పరిస్థితుల్లో సంయమనం పాటించడమనేది బలహీనత చాటుకోవడమే అవుతుందన్నారు. ''మాటల కంటే బలంగా చేతలు చూపించాల్సిన తరుణం అది. 26/11 దాడుల తర్వాత అలాంటి సమయమే వచ్చింది'' అని తివారీ తన పుస్తకంలో పేర్కొన్నారు.


ముంబైలో 2008 నవంబర్ 26న వరుస ఉగ్రదాడులు చోటుచేసుకున్నాయి. పాకిస్థాన్‌కు చెందిన ఎల్‌ఈటీ ఉగ్రవాదులు 12 చోట్ల ముంబైలో పేలుళ్లు జరిపారు. ఈ వరుస పేలుళ్లలో 150 మందికి పైగా ప్రజల ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. తొమ్మిది మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు కాల్చిచంపగా, అజ్మల్ కసబ్‌ను సజీవంగా పట్టుకుని. 2012లో కసబ్‌ను ఉరితీశారు.


బీజేపీ స్పందన...

సల్మాన్ ఖుర్షీద్ తర్వాత మరో కాంగ్రెస్ నేత మనీష్ తివారీ యూపీఏను వేలెత్తిచూపారని, 26/11 ఘటన నేపథ్యంలో యూపీఏ అనుసరించిన వైఖరిని, బలహీనతను మనీష్ తివారీ తన పుస్తకంలో బహిర్గతం చేశారని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్‌ మాలవీయ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. దాడులకు ఐఏఎఫ్ సిద్ధపడినా యూపీఏ నిలువరించిందని ఎయిర్ చీఫ్ మార్షల్ ఫాలి మేజర్ ఇప్పటికే వెల్లడించినట్టు అమిత్ మాలవీయ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ సీనియర్ సల్మాన్ ఖుర్షీద్ ఇటీవల తన పుస్తకంలో హిందుత్వను రాడికల్ జీహాదిస్టు గ్రూపులైన ఐఎస్ఐఎస్‌, బొకో హరామ్‌లతో పోల్చడం వివాదాస్పదమైంది.

Updated Date - 2021-11-23T18:15:48+05:30 IST