అన్న మాట నిలబెట్టుకున్న ‘మాన్సూన్’
ABN , First Publish Date - 2020-06-01T21:56:39+05:30 IST
ఈ యేడాది మాత్రం మాన్సూన్ అన్న మాట మీద నిలబడింది. జూన్ 1న కేరళలోకి ప్రవేశిస్తుందని
న్యూఢిల్లీ : ఈ యేడాది మాత్రం మాన్సూన్ అన్న మాట మీద నిలబడింది. జూన్ 1న కేరళలోకి ప్రవేశిస్తుందని చెప్పిన మాన్సూన్... జూన్ ఒకటినే కేరళలోకి ప్రవేశించింది. ఈ విషయాన్ని భారత వాతావరణ విభాగం సోమవారం ప్రకటించింది. మాన్సూన్ కంటే ముందే వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని, మాన్సూన్ సరైన సమయంలోనే వచ్చిందని చెప్పడానికి తమ వద్ద ఇతర ప్రమాణాలు కూడా ఉన్నాయని వాతావరణ విభాగం ఎండీ తెలిపారు.
అరేబియా సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా కేరళలో భారీగా వర్షాలు కురుస్తున్నాయని ఆయన అన్నారు. ఈ కారణంగానే నిసర్గ అన్న తుఫాన్గా మారి, ఉత్తరం వైపుకు వెళ్లి, జూన్ 3 నాటికి ఉత్తర మహారాష్ట్ర, గుజరాత్కు చేరే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. అరేబియా సముద్రంపై ఏర్పడ్డ అల్పపీడనం కారణంగానే మాన్సూన్ వర్షాలు కురవడానికి పరిస్థితులు అనుకూలించాయని పేర్కొన్నారు.
దక్షిణ అరేబియా సముద్రం మరియు లక్షదీవులు మొత్తం ప్రాంతాలు, మాల్దీవులలోని మిగిలిన ప్రాంతాలు, కేరళ మరియు మహే లోని చాలా ప్రాంతాలు మరియు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ లోని కొన్ని ప్రాంతాలు, కోమోరిన్ మరియు ఆగ్నేయ బంగాళాఖాతం లో మరి కొన్ని ప్రాంతాలలోనికి నైఋతి రుతుపవనాలు విస్తరించాయి.
నైఋతి రుతుపవనాలు ఈరోజు (జూన్ 1 వ తేదీన) కేరళ రాష్ట్రంలోనికి ప్రవేశించడం వలన సాధారణ తేదీ జూన్ 1 వ తేదీకే నైఋతి రుతుపవనాలు కేరళ రాష్ట్రంలోనికి ప్రవేశించినట్లైందని హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకులు కూడా తెలిపారు.