మీ కులగజ్జిని అందరికీ ఆపాదిస్తే ఎలా?: మంతెన

ABN , First Publish Date - 2021-06-24T15:52:48+05:30 IST

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కులాన్ని తిట్టినట్లా శ్రీరంగనాథరాజు.? అంటూ మంతెన ప్రశ్నించారు.

మీ కులగజ్జిని అందరికీ ఆపాదిస్తే ఎలా?: మంతెన

అమరావతి: ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కులాన్ని తిట్టినట్లా శ్రీరంగనాథరాజు? అంటూ టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఏది జరిగినా చంద్రబాబుకు ఆపాదించడం వైసీపీకి అలవాటైపోయిందని మండిపడ్డారు. కులాల మధ్య మంటలు రాజేసి ఆ మంటల్లో చలికాచుకునే నీచమైన పార్టీ వైసీపీ అని అన్నారు. మీ పార్టీకి ఉన్న కులగజ్జిని అందరికీ ఆపాదిస్తే ఎలా.? అని ప్రశ్నించారు.  విధానపరంగా ఎదుర్కోవడం చేతకాక క్షత్రియుల మధ్య జగన్ రెడ్డి వివాదాలకు ఆజ్యం పోస్తున్నారని విమర్శించారు. 


సీఎం జగన్ రెడ్డి కులానికి ఇచ్చిన 822 నామినేటెడ్ పదవుల్లో ఒక్క పదవినైనా ఇతర కులానికి కట్టబెట్టారా? అని మంతెన ప్రశ్నించారు. క్షత్రియుల అభివృద్ధికి ఏం కృషి చేశారన్నారు. బీసీలు సఖ్యతగా ఉన్నారని వారిలో ఎడబాట్లు తెచ్చేందుకు కులానికి ఒక కార్పొరేషన్ పెట్టారని,  కాసుల్లేని కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసి బీసీలను అవమానించారన్నారు. ఎన్నో భూదానాలు చేసి దేశంలోనే గొప్ప రాజవంశంలో పుట్టిన అశోక్ గజపతిరాజును వెల్లంపల్లి శ్రీనివాస్ వెధవ అని సంబోధించినప్పుడు శ్రీరంగనాథరాజు ఎక్కడ వున్నారని ప్రశ్నించారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని మంతెన హెచ్చరించారు.

Updated Date - 2021-06-24T15:52:48+05:30 IST