తుఫాన్ విధులకు పలువురు డుమ్మా
ABN , First Publish Date - 2021-12-05T06:07:43+05:30 IST
తుఫాన్ సమయంలో అనుక్షణం అప్ర మత్తంగా ఉండాల్సిన మండలంలోని పలువురు అధికారులతో పాటు కొందరు పంచాయతీ కార్యదర్శులు విధులకు గైర్హా జరు కావడం చర్చనీయాంశమైంది.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతానన్న ఎంపీడీవో యాదగిరేశ్వరరావు
కార్యదర్శులకు ఒక రోజు జీతం కట్తో పాటు.. షోకాజ్ జారీ చేస్తామని వెల్లడి
ప్రకృతి ప్రకోపిస్తే తమ పరిస్థితి ఏం కావాలని మండల వాసులు ప్రశ్న
నాతవరం, డిసెంబరు 4 : తుఫాన్ సమయంలో అనుక్షణం అప్ర మత్తంగా ఉండాల్సిన మండలంలోని పలువురు అధికారులతో పాటు కొందరు పంచాయతీ కార్యదర్శులు విధులకు గైర్హా జరు కావడం చర్చనీయాంశమైంది. దీంతో విధులకు డుమ్మా కొట్టిన ఆయా పంచాయతీ కార్యదర్శులకు ఒకరోజు జీతం కట్ చేస్తున్నట్టు ఎంపీడీవో ఎల్. యాదగిరేశ్వరరావు శనివారం తెలిపారు. అంతే కాకుండా వారందరికీ షోకాజ్ నోటీసులు కూడా జారీ చేయనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం తాను, తహసీల్దార్ జానకమ్మ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి తుఫాన్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించామన్నారు. అయినప్పటికీ కొందరు మండలస్థాయి అధికారులు కూడా తుఫాన్ విధులకు హాజరు కాలే దని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతామని చెప్పారు.ఇదిలావుంటే, శుక్ర, శనివారాల్లో పంచాయతీరాజ్ జేఈ, ఆర్అండ్బీ జేఈ తదితరులు తుఫాన్ విధులకు హాజరు కాలేదని తెలిసింది. అలాగే, నాతవరం ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు కూడా సాయం కాలం విధులు ముగించుకుని వెళ్లిపోయారే తప్ప, తుఫాన్ గండం గట్టెక్కే వరకు స్థానికంగా ఉండ లేదని చెప్పుకుంటున్నారు. కొందరు వీఆర్వోలు కూడా స్థానికంగా ఉండలేదని వినికిడి. దీంతో ప్రకృతి ప్రకోపించి, జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని మండల వాసులంతా ముక్తకంఠంతో ప్రశ్నిస్తున్నారు.