ఉమ్మడి జిల్లాలో పలువురి హోంక్వారంటైన్‌

ABN , First Publish Date - 2020-06-04T10:17:26+05:30 IST

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బుధవారం మందిని అధికారులు హోంక్వారంటైన్‌ చేశారు.

ఉమ్మడి జిల్లాలో పలువురి హోంక్వారంటైన్‌

చౌటుప్పల్‌ టౌన్‌/ వలిగొండ / మోత్కూరు/ ఆలేరు రూరల్‌ / రాజాపేట / యాదాద్రి రూరల్‌ / మిర్యాలగూడ అర్బన్‌ / మునుగోడు, జూన్‌ 3 : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బుధవారం మందిని అధికారులు హోంక్వారంటైన్‌ చేశారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ పట్టణంలో రెండు కాలనీలను కట్టడి ప్రాంతాలను చేస్తూ 53మందిని హోంక్వారంటైన్‌ చేశారు. స్థానిక కూరగాయల వ్యాపారికి కరోనా పాజిటివ్‌ రావటంతో మార్కండేయనగర్‌(పార్ట్‌)తో పాటు విద్యానగర్‌ను కట్టడి ప్రాంతాలుగా అధికారులు ప్రకటించారు. ఈ రెండు కాలనీల్లో 53 మందిని 14రోజుల పాటు హోం క్వారంటైన్‌ చేశారు. పాజిటివ్‌  కేసు నమోదైన వ్యాపారితో పాటు, వైద్యం కోసం వ్యాపారిని హైదరాబాద్‌కు కారులో తీసుకువెళ్లిన వ్యక్తి ఇళ్లు మార్కండేయనగర్‌లో ఉండగా,వ్యాపా రికి ప్రాథమికంగా వైద్యం అందించిన నర్సింగ్‌ హోం, రక్త పరీక్షలు నిర్వహించిన ల్యాబ్‌, మం దులు ఇచ్చిన మెడికల్‌షాప్‌ యజమానుల ఇళ్లు విద్యానగర్‌కాలనీలో ఉన్నాయి. ఆ వ్యాపారి సోదరుడి ఇల్లు కూడా ఇదే కాలనీలో ఉంది. దీంతో ఈ రెండు కాలనీలను కట్టడి ప్రాంతాలుగా అధికారులు ఖరారుచేశారు. ప్రభుత్వ వైద్యాధికారులు శివప్రసాద్‌రెడ్డి, డాక్టర్‌ సుమన్‌ కల్యాణ్‌, సీఐ వెంకటేశ్వర్లు కాలనీల్లో తిరిగి వ్యాపారి కుటుంబసభ్యులు సహా  53 మందిని గుర్తించి 14రోజుల పాటు హోంక్వారంటైన్‌ విధించారు. వీరిలో  25మంది ప్రైమరీ కాంటాక్టుగా 28మందిని సెకండరీ కాంటాక్టుగా గుర్తించారు.  మరోవైపు డీహెచ్‌ఎంవో సాంబశివరావు కూరగాయల మార్కెట్‌తో పాటు కట్టడి ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. అదేవిధంగా చౌటుప్పల్‌ వ్యాపారితో సంబంధం ఉన్న వలిగొండ మండల కేంద్రానికి చెందిన ఓ వ్యాపారి కూడా హోం క్వారంటైన్‌ చేశారు.


మోత్కూరు మండలంలోని వివిధ గ్రామాలకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 10 మందిని హోంక్వారంటైన్‌ చేసినట్లు పీహెచ్‌సీ డాక్టర్‌ కిషోర్‌కుమార్‌ తెలిపారు. ఆలేరు మండలంలో కరోనా పాజిటివ్‌గా వచ్చిన కొల్లూరు గ్రామానికి చెందిన మహిళ కుటుంబానికి చెందిన 8 మందిని బీబీనగర్‌ ఏయిమ్స్‌ క్వారంటైన్‌కు తరలించారు. రాజాపేట మండలం దూదివెంకటాపూర్‌లో కరోనా మృతి చెందిన మహిళ కుటుంబ సభ్యులతో కాంటాక్ట్‌లో ఉన్న 14 మందిని హోంక్వారంటైన్‌ చేశారు. అదేవిధంగా యాదగిరిగుట్ట మండలంలోని జంగంపల్లి గ్రామంలో ఓ వృద్ధురాలిని హోంక్వారంట్‌లో చేశారు. రాజపేట మండలం దూదివెంకటాపురం గ్రామానికి చెందిన కరోనా పాజిటివ్‌ వచ్చిన మహిళ వృద్దురాలు ఇంటికి వచ్చి వెళ్లడంతో ముందస్తుగా వైద్య పరీక్షలు నిర్వహించి హోంక్వారంట్‌లో ఉండాలని ఆదేశించారు. అదేవిధంగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డికాలనీకి చెందిన రెండు కుటుంబాలను హోంక్వారంటైన్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన వ్యక్తి కరోనాతో మృతి చెందగా, అతడి మృతదేహాన్ని స్వస్థలానికి తరలిస్తుండగా, మిర్యాలగూడలో రెండు కుటుంబాల వారు సందర్శించారు. సత్తెనపల్లి వైద్యాధికారి సూచన మేరకు రెండు కుటుంబాల్లోని నలుగురిని హోంక్వారంటైన్‌ చేసినట్లు డిప్యూటీ డీఎంహెచ్‌వో రవి తెలిపారు. త్వరలో వీరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా మునుగోడు మండలం సింగారం, మునుగోడు గ్రామాలకు చెందిన ఏడుగురిని అధికారులు బుధవారం క్వారంటైన్‌ చేశారు. సింగారం గ్రామానికి చెందిన మహిళ కరోనా పాజిటివ్‌తో మృతి చెందగా, ఆమెను కలిసిన నలుగురు, ఆమెను ఆస్పత్రికి తరలించిన ఆటోడ్రైవర్‌ను నల్లగొండలోని ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉంచగా, మహిళకు చికిత్స చేసిన ఆర్‌ఎంపీ, మందులు విక్రయించిన మెడికల్‌ షాపు యజమానిని హోంక్వారంటైన్‌ చేశారు. బుధవారం వీరందరికీ నల్లగొండలో వైద్య పరీక్షలు నిర్వహించారు.

Updated Date - 2020-06-04T10:17:26+05:30 IST