మన్యం బంద్‌ ప్రశాంతం

ABN , First Publish Date - 2021-11-27T06:14:56+05:30 IST

లోతుగెడ్డ ఆశ్రమ పాఠశా హెచ్‌ఎం రాజంనాయుడుపై దాడికి నిరసనగా ఆదివాసీ జేఏసీ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం జరిగిన బంద్‌ ప్రశాంతంగా ముగిసింది.

మన్యం బంద్‌  ప్రశాంతం
పాడేరు అంబేడ్కర్‌ కూడలి వద్ద మాట్లాడుతున్న జేఏసీ నేతలు

పాడేరు, నవంబరు 26: లోతుగెడ్డ ఆశ్రమ పాఠశా హెచ్‌ఎం రాజంనాయుడుపై దాడికి నిరసనగా ఆదివాసీ జేఏసీ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం జరిగిన బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా పాడేరు పట్టణంలో  జేఏసీ నేతలు, ఉద్యోగులు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేడ్కర్‌ కూడలి వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో జేఏసీ నేతలు మాట్లాడారు. హెచ్‌ఎంపై దాడి ఘటనలో చింతపల్లి ఏఎస్‌పీ, అన్నవరం ఎస్‌ఐ, గిరిజన ప్రాంత ప్రజాప్రతినిధులు వివక్షగా వ్యవహరిస్తూ బాధితుడికి న్యాయం చేయడం లేదన్నారు. గిరిజన ఉద్యోగిపై దాడికి పాల్పడిన వారిపై ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసులను నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు. అలాగే గిరిజనేతరులు ఏజెన్సీ ప్రాంతాన్ని విడిచిపెట్టాలని, ఆ బాధ్యతను ఐటీడీఏ పీవో తీసుకోవాలని జేఏసీ నేతలు డిమాండ్‌ చేశారు. ఈ ఆందోళనలో జేఏసీ నేతలు సీహెచ్‌.శ్రీనివాస్‌పడాల్‌, ఎస్‌.గంగరాజు, ఆర్‌.నాగభూషణరాజు, కె.గంగన్నపడాల్‌, కె.రామారావు, ఎం.సింహాద్రి, ఎస్‌.సింహాచలం, జి.వరలక్ష్మి, బుడెద సుమన్‌, బి.మాధవరావు, కిషోర్‌, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు. జేఏసీ తలపెట్టిన మన్యం బంద్‌లో భాగంగా ఆర్టీసీ బస్సులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన జేఏసీ కన్వీనర్‌ రామారావుదొరను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే హోటళ్లు, దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేయగా, మిగతా కార్యకలాపాలు యథాతథంగానే సాగాయి. మధ్యాహ్నం జేఏసీ నేతలు, ఉద్యోగులు, విద్యార్థుల నిరసన ర్యాలీతో ఆందోళన ముగిసింది. ఆందోళన నేపథ్యంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 


 

Updated Date - 2021-11-27T06:14:56+05:30 IST