భద్రాద్రిలో మరోసారి రెచ్చిపోయిన మావోలు

ABN , First Publish Date - 2020-10-25T17:28:01+05:30 IST

తెలంగాణలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు.

భద్రాద్రిలో మరోసారి రెచ్చిపోయిన మావోలు

భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. తమ ఉనికిని చాటుకునేందుకు రెండ్రోజులకోసారి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ నేతను అతి కిరాతంగా హత్య చేసిన విషయం విదితమే. అప్పట్నుంచి ములుగుతో పాటు పలు ప్రాంతాల్లో పోలీసులు, ప్రత్యేక బృందాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ తరుణంలో ములుగులో ఇద్దరు మావోయిస్టులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఓ వైపు పోలీసులు కూంబింగ్ పెంచడం.. మావోలను ఏరివేయాలని ప్లాన్స్ చేస్తుంటే నక్సలైట్లు మాత్రం ఏదో ఒక రూపంలో ఉనికిని చాటుకుంటూ వస్తున్నారు.


దసర పండుగ పూట భద్రాద్రి కొత్తగూడెంలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇన్‌ఫార్మర్ నెపంతో హోంగార్డును కొట్టి చంపారు. మృతుడు నాయకులపు ఈశ్వర్ ములుగు జిల్లా మల్లంపల్లి వాసిగా స్థానికులు గుర్తించారు. ఈ ఘటన అనంతరం చెన్నాపురం సమీపంలోని గోరుగొండ దగ్గర మావోలు మృతదేహం వదిలివెళ్లారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఇందుకు సంబంధించి పోలీసులుకానీ ఉన్నతాధికారులు కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.



Updated Date - 2020-10-25T17:28:01+05:30 IST