మార్కెట్యార్డుల్లో పెట్రోలు బంకులు!
ABN , First Publish Date - 2021-10-26T06:28:55+05:30 IST
మార్కెట్ కమిటీల ఆదాయం పెంపునకు మార్కెటింగ్ శాఖ కసరత్తు ప్రారంభించింది. అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటోంది.
మార్కెట్ కమిటీల ఆదాయం పెంపునకు కసరత్తు
జిల్లావ్యాప్తంగా 11 యార్డుల్లో ఏర్పాటు దిశగా చర్యలు
అనంతపురంరూరల్, అక్టోబరు 25: మార్కెట్ కమిటీల ఆదాయం పెంపునకు మార్కెటింగ్ శాఖ కసరత్తు ప్రారంభించింది. అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. జిల్లావ్యాప్తంగా మార్కెట్ కమిటీల్లో మూ డునాలుగు మినహా అన్ని కమిటీల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఒకవైపు కరోనా మహమ్మారి, మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వ్యవసాయ చట్టాల కారణంగా మార్కెటింగ్ శాఖాభివృద్ధి పూర్తిగా కుంటు పడింది. ఇటీవల కాలంలో జిల్లాలోని చాలా మార్కెట్ కమిటీల్లో పనిచేసే ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈక్రమంలోనే కొన్ని కమిటీల్లో కాంట్రాక్టు, దినకూలీలుగా పనిచేస్తున్న కార్మికులను తొలగించారు. మార్కెటింగ్ శాఖకు పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా సంబంధిత అధికారులు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే శాఖ ఆదా యం పెంపునకు చర్యలు తీ సుకుంటున్నారు. అందులో భాగం గా యార్డుల్లో పెట్రోల్ బంకు లు ఏ ర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
11 యార్డుల్లో పెట్రోల్ బంకులు
జిల్లాలో 17 మార్కెట్ యార్డులున్నాయి. ఇందులో ప్రస్తుతం అనంతపురం, హిందుపురం, ధర్మవరం, కదిరి, పుట్టపర్తి, శింగనమల, తాడిపత్రి మార్కెట్ యార్డుల ఆదాయం ఆశాజనకంగానే ఉంది. రాప్తాడు, గుంతకల్లు, పెనుకొండ, మడకశిర తదితర మార్కెట్ యార్డుల్లో ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. కనీసం ఆయా కమిటీల్లో పనిచేసే ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితులున్నాయి. గతంలో పండ్లు, కూరగాయలపై 1 శాతం పన్ను వచ్చేది. కేంద్రం తీసువచ్చిన వ్యవసాయ చట్టాల కారణంగా పన్ను వసూలు కూడా లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో ఆదాయం పెంపులో భాగంగా యార్డుల్లో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని అనంతపురం, హిందూపురం, రాప్తాడు, పుట్టపర్తి, పెనుకొండ, రాయదుర్గం, ఉరవకొండ, గుత్తి, తనకల్లు తదితర 11 యార్డుల్లో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయనున్నారు. ఈక్రమంలోనే బంకులు ఏర్పాటుకు స్థలాల పరిశీలనకు త్వరలోనే ఆయిల్ కంపెనీల ప్రతినిధులు రానున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే మార్కెటింగ్ శాఖకు మంచి రోజులు వచ్చినట్లే.
పర్యవేక్షణ మా పరిధిలోనే..:
పరమేశ్వర్, ఏడీ, మార్కెటింగ్ శాఖ
మార్కెట్ యార్డుల ఆదాయం పెంపునకు పెట్రోల్ బంకుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే 11 మార్కెట్ యార్డులు బంకుల ఏర్పాటుకు అనువుగా ఉన్నాయని ఉన్నతాధికారులకు నివేదిం చాం. ఈక్రమంలోనే ఆ యిల్ కంపెనీ ప్రతినిధులు స్థల పరిశీలన కు రానున్నారు. బం కుల్లో పనిచేసేది మార్కెట్ సిబ్బందా లేక ఆయిల్ కంపెనీకి సంబంధించినవారా అన్నది తెలియాల్సి ఉంది. పర్యావేక్షణ మాత్రం మార్కెటింగ్ శాఖకే ఉంటుంద ని తెలిసింది. త్వరలోనే వీ టన్నింటిపై స్పష్టత వస్తుంది.