పెళ్లయిన కొన్ని నెలలకే గృహిణి అనుమానాస్పద మృతి
ABN , First Publish Date - 2021-04-08T12:06:48+05:30 IST
గతేడాది లాక్డౌన్ సమయంలో యూసుఫ్గూడ సంజయ్నగర్కు చెందిన...
హైదరాబాద్/బంజారాహిల్స్ : వివాహం అయి తొమ్మిది నెలలు కూడా గడవకముందే యువతికి అత్తింటి వేధింపులు తప్పలేదు. అదనపు కట్నం, మానసిక ఇబ్బందుల మధ్య ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. జీడిమెట్లకు చెందిన యాదగిరి, అక్కమ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. చిన్న కుమార్తె శైలజ(23)ను గతేడాది లాక్డౌన్ సమయంలో యూసుఫ్గూడ సంజయ్నగర్కు చెందిన నవీన్కు ఇచ్చి వివాహం చేశారు. డ్రైవర్ అయిన నవీన్కు పెళ్లి సమయంలో వరకట్నం కూడా ఇచ్చారు. కొద్ది రోజులు వారి కాపురం బాగానే సాగింది. ఇంతలో భర్త నవీన్, అత్త తిరుపతమ్మ అదనపు కట్నం కోసం వేధింపులు మొదలు పెట్టారు.
ఇంట్లో గొడవలు జరగడంతో శైలజ పుట్టింటికి వచ్చేది. అనంతరం పెద్దమనుషులు ఒప్పించి కాపురం సరిదిద్దేవారు. ఈ నెల 6న అర్ధరాత్రి శైలజ ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుందని నవీన్ ఆమె తండ్రి యాదగిరికి ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే తల్లిదండ్రులు సంజయ్నగర్కు చేరుకున్నారు. అప్పటికే శైలజ మృతదేహాన్ని కిందకు దించి మంచంపై పడుకోబెట్టారు. తమ కుమార్తెది ఆత్మహత్య కాదని చంపి ఉరివేశారని యాదగిరి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.