చంద్రగిరిలో భారీ చోరీ
ABN , First Publish Date - 2021-12-03T07:10:05+05:30 IST
చంద్రగిరిలోని కొత్తపేట బస్టాండు కూడలిలో కోసూరి కాంప్లెక్స్లోని రెండు దుకాణాల్లో భారీ చోరీ జరిగింది.
చేగు ఆగ్రో ఎంటర్ ప్రైజస్, చేగుమార్టులో రూ.2.60 లక్షల నగదు, రూ.5.35 లక్షల వస్తువుల అపహరణ
చంద్రగిరి, డిసెంబరు 2: చంద్రగిరిలోని కొత్తపేట బస్టాండు కూడలిలో కోసూరి కాంప్లెక్స్లోని రెండు దుకాణాల్లో భారీ చోరీ జరిగింది. చేగు ఆగ్రో ఎంటర్ ప్రైజస్, చేగు మార్టులలో దుండగులు చొరబడి రూ.2.6 లక్షల నగదు, రూ.5.35 లక్షల సామాన్లను అపహరించారు. పోలీసుల కథనం మేరకు చంద్రగిరి.. చేగు ఆగ్రో ఎంటర్ ప్రైజస్, చేగు మార్టుల షట్టర్లకు బుధవారం రాత్రి సిబ్బంది తాళాలు వేసుకొని వెళ్లారు. ఈ రెండు దుకాణాల షట్టర్లను వంచి.. తెరచి ఉండటాన్ని గురువారం ఉదయం 7 గంటలకు చూసిన స్థానికులు షాపు యజమానులకు సమాచారమిచ్చారు. చేగు ఎంటర్ ప్రైజస్ యజమాని చేగు గోవర్ధన్గుప్తా, చేగు మార్ట్ మేనేజర్ వంశీకృష్ణ దుకాణాల వద్ద చూసి.. చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు క్లూస్ టీముల ద్వారా వేలిముద్రలు సేకరించారు. చేగు ఆగ్రో ఎంటర్ ప్రైజ్సలో రూ.2.6 లక్షల నగదు, రూ.1,95,000 విలువైన మోటార్లు, విద్యుత్ వైర్లు చోరీకి గురైనట్లు తెలిపారు. చేగు మార్టులో రూ.1,10,000 విలువైన హర్డ్ డిస్క్, రెండు డీవీఆర్లు, రూ.50 వేల విలువైన డ్రై ఫ్రూట్స్, రూ.లక్ష విలువైన ఫ్యాన్సీ చీరలు, రూ.80 వేల వెండి గిఫ్టు కాయిన్స్ చోరీ అయినట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.