మ్యాట్రిమోనీలో పరిచయం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి...

ABN , First Publish Date - 2021-05-01T14:46:29+05:30 IST

ఓ మ్యాట్రిమోనీ సంస్థ ద్వారా నగరానికి చెందిన యువతితో పరిచయం పెంచుకున్న..

మ్యాట్రిమోనీలో పరిచయం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి...

  • యువతి వద్ద రూ. 10 లక్షలు కాజేసిన సైబర్‌ కేటుగాడు

హైదరాబాద్/హిమాయత్‌నగర్‌ : ఓ మ్యాట్రిమోనీ సంస్థ ద్వారా నగరానికి చెందిన యువతితో పరిచయం పెంచుకున్న సైబర్‌ కేటుగాడు ఆమె వద్ద రూ. 10 లక్షలు కాజేశాడు. హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బేగంపేట్‌కు చెందిన యువతి వరుడి కోసం ఓ ప్రముఖ మ్యాట్రిమోనీ సంస్థలో రిజిస్టర్‌ చేసుకుంది. అందులో ఆమె ప్రొఫైల్‌ చూసిన ఓ సైబర్‌ కేటుగాడు యువతితో పరిచయం పెంచుకున్నాడు. తన పేరు మెహూల్‌కుమార్‌ అని, గుజరాత్‌లో ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తినని, అమెరికాలోనే పుట్టి పెరిగానని, నన్ను పెళ్లిచేసుకోవడానికి అంగీకరిస్తే అమెరికా రావడానికి ఏర్పాట్లు చేస్తానని నమ్మించాడు. కొద్ది రోజులపాటు స్కైప్‌, వాట్సాప్‌ వీడియోలో మాట్లాడుతూ యువతితో మరింత చనువు పెంచుకున్నాడు. 


గుజరాత్‌లో కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి డబ్బులు అవసరమని, కొంత డబ్బు ఇస్తే తర్వాత నీ బ్యాంక్‌ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేస్తానని నమ్మించి ఆమె నుంచి రూ. 4 లక్షలు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నాడు. తర్వాత తాను హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో దిగానని, కోట్ల రూపాయలు తీసుకొస్తుంటే కస్టమ్స్‌ అధికారులు అనుమానించి తనను పట్టుకున్నారని, వారికి రూ. 6 లక్షలు చెల్లిస్తే విడిచిపెడతారని నమ్మించి ఆమె నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నాడు. తర్వాత యువతి అతడికి ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ రావడంతో మోసపోయానని గ్రహించి సైబర్‌ క్రైమ్‌ పీఎస్‌లో శుక్రవారం ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-05-01T14:46:29+05:30 IST