పసిడి మళ్లీ జిగేల్

ABN , First Publish Date - 2021-01-05T06:47:58+05:30 IST

బులియన్‌ మార్కెట్లో మళ్లీ ర్యాలీ ప్రారంభమైంది. దేశీయ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరలు రెండు నెలల గరిష్ఠ స్థాయికి చేరాయి. సోమవారం ముంబై స్పాట్‌ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన

పసిడి మళ్లీ జిగేల్

రెండు నెలల గరిష్ఠ స్థాయిలో బంగారం, వెండి ధరలు

10 గ్రాముల ధర రూ.51,000 ఎగువకు 

రూ.69,000 దాటిన వెండి 


న్యూఢిల్లీ: బులియన్‌ మార్కెట్లో మళ్లీ ర్యాలీ ప్రారంభమైంది. దేశీయ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరలు రెండు నెలల గరిష్ఠ స్థాయికి చేరాయి. సోమవారం ముంబై స్పాట్‌ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన (24 క్యారట్స్‌) బంగారం ధర రూ.894 లాభంతో రూ.51,192 వద్ద స్థిరపడగా కిలో వెండి ధర ఏకంగా రూ.2,039 పెరిగి రూ.69,002 వద్ద ముగిసింది. మరోవైపు ఢిల్లీ మార్కెట్లోనూ ఇదే ట్రెండ్‌ కనిపించింది. 

ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి పసిడి రూ.877 లాభంతో రూ.50,619 వద్ద, కిలో వెండి రూ.2,012 వృద్ధి చెంది రూ.69,454 వద్ద స్థిరపడ్డాయి. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరగడం వరుసగా ఇది నాలుగో రోజు. 


హైదరాబాద్‌లో కిలో వెండి రూ.72,000

హైదరాబాద్‌ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు దూసుకుపోయాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర  రూ.430 లాభపడి రూ.51,600 వద్ద ముగిసింది. కాగా వెండి ధర శనివారంతో పోల్చితే ఎలాంటి మార్పు లేకుండా రూ.72,000 వద్ద క్లోజైంది. 


ఫ్యూచర్స్‌లోనూ అదే ట్రెండ్‌ 

ఫ్యూచర్స్‌ మార్కెట్లోనూ ఇదే ట్రెండ్‌ కనిపించింది. ఫిబ్రవరి నెల డెలివరీ ఇచ్చే 10 గ్రాముల బంగారం ధర మల్టీ కమోడిటీస్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎంసీఎక్స్‌)లో రూ.892 లాభంతో రూ.51,188కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఇదే ట్రెండ్‌ కనిపిస్తోంది. సోమవారం లండన్‌ బులియన్‌ మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 1,935 డాలర్ల వద్ద ట్రేడైంది. 


ర్యాలీకి కారణాలు  

ఐరోపా, జపాన్‌లో వేగంగా వ్యాపిస్తున్న కొవిడ్‌ స్ట్రెయిన్‌

ప్రధాన కరెన్సీలతో డాలర్‌ మారకం రేటు బలహీనపడటం

పెట్టుబడుల రక్షణ కోసం ఇన్వెస్టర్లు మరింతగా పసిడిని ఎంచుకోవడం

లాక్‌డౌన్లతో ఆర్థిక వ్యవస్థలు మళ్లీ అల్లకల్లోలమవుతాయనే భయాలు

మంగళవారం వెలువడే జార్జియా రాష్ట్ర ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందోననే భయాలు. ఈ ఫలితం వ్యతిరేకంగా వస్తే జో బైడెన్‌ అమెరికా అధ్యక్షుడయ్యే అవకాశం సన్నగిల్లుతుంది. 


డాలర్‌ మారకం రేటు పతనం, కొవిడ్‌ భయాలతో పసిడి ధర మళ్లీ ఊపందుకుంది. ఫిబ్రవరి డెలివరీ ఇచ్చే 10 గ్రాముల పసిడి ధర ఎంసీఎక్స్‌లో రూ.51,400 వరకు వెళ్లే అవకాశం ఉంది. రూ.50,800ను మద్దతు ధరగా పరిగణించాలి. 

 తపన్‌ పటేల్‌, సీనియర్‌ అనలిస్ట్‌, హెచ్‌డీఎ్‌ఫసీ సెక్యూరిటీస్‌



ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) పసిడి 1,936 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వచ్చే కొద్ది రోజుల్లో ఇది 1,960 నుంచి 1,965 డాలర్ల వరకు వెళ్లే అవకాశం ఉంది. 

 రవీంద్ర రావు, వైస్‌ ప్రెసిడెంట్‌, 

కోటక్‌ సెక్యూరిటీస్‌ 

Updated Date - 2021-01-05T06:47:58+05:30 IST