రమేష్ గాంధీ మరణం బాధాకరం
ABN , First Publish Date - 2021-04-11T05:17:13+05:30 IST
ఎందరినో నాయకులుగా తీర్చిదిద్దిన పాదర్తి రమేష్ గాంధీ మరణం ఎంతో బాధించిందని నగర మేయర్ మనోహర నాయుడు అన్నారు.
నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు
గుంటూరు(కార్పొరేషన్), ఏప్రిల్ 10: ఎందరినో నాయకులుగా తీర్చిదిద్దిన పాదర్తి రమేష్ గాంధీ మరణం ఎంతో బాధించిందని నగర మేయర్ మనోహర నాయుడు అన్నారు. శనివారం గుంటూరు నగరం 6వ డివిజన్ కార్పొరేటర్ పాదర్తి రమేష్ గాంధీ సంతాప సభ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగింది. తొలుత రమేష్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉంటూ ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా ఉండే రమేష్ గాంధీ మరణం తీరని లోటన్నారు. గుంటూరు నగరాభివృద్ధికి కృషి చేయడమే ఆయనకి ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. మార్కెట్ యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ గుంటూరు నగరంలో అండగా నిలిచిన వ్యక్తి రమేష్ గాంధీ అన్నారు. డిప్యూటీ మేయర్ వనమా బాల వజ్ర బాబు, అన్ని డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు.