ఐపీఎల్ అప్పుడే జరిగి ఉంటే.. గర్భంతోనే యాంకరింగ్ చేసేదానిని: మయాంతి లాంగర్
ABN , First Publish Date - 2020-09-19T23:58:05+05:30 IST
మయాంతి లాంగర్.. ఐపీఎల్ అభిమాలకు చిరపరిచితమైన పేరు. ఐపీఎల్ యాంకర్లో బోల్డంత క్రేజ్ సంపాదించుకున్న మయాంతి.. ఈసారి
ముంబై: మయాంతి లాంగర్.. ఐపీఎల్ అభిమాలకు చిరపరిచితమైన పేరు. ఐపీఎల్ యాంకర్గా బోల్డంత క్రేజ్ సంపాదించుకున్న మయాంతి.. ఈసారి మాత్రం అందుబాటులో లేదు. ఆరు వారాల క్రితమే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఆమె తాజాగా భర్త, కుమారుడితో కలిసి దిగిన ఫొటోను ట్వీట్ చేసింది.
నిజానికి ఐపీఎల్కు ఆమె అందుబాటులో ఉంటుందని భావించారు. అయితే, ఆమె ఈసారి అందుబాటులో ఉండడం లేదని స్టార్స్పోర్ట్స్ రెండు రోజుల క్రితం ప్రకటించింది. గత రెండు ఐపీఎల్ సీజన్లలో ప్యానల్గా ఉన్న మయాంతి లెక్కలేనని ఐపీఎల్ ఈవెంట్స్ను కవర్ చేసింది. ఐపీఎల్-13కు ఆమె అందుబాటులో ఉండడం లేదని తెలిసి అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు.
ఆమె స్థానాన్ని భర్తీ చేసిన స్టార్స్పోర్ట్స్ పూర్తిస్థాయి ప్యానల్ ప్రెజెంటర్ల పేర్లను ప్రకటించింది. సురేన్ సుందరం, కీరా నారాయణన్, సుహైల్ చందోక్, నస్ప్రీత్ కౌర్, సంజన గణేశన్, జతిన్ సప్రు, తాన్యా పురోహిత్, అనంత్ త్యాగి, ధీరజ్ జునేజా, నెరోలి మెడోస్లు టోర్నమెంట్ను ప్రెజెంట్ చేస్తారని పేర్కొంది.
ఐపీఎల్కు తాను అందుబాటులో లేకపోవడంపై మయాంతి స్పందించింది. ఐపీఎల్ అనుకున్నట్టే మార్చిలోనే జరిగి ఉంటే తాను ఐదు నెలల గర్భంతోనే యాంకరింగ్ చేసి ఉండేదానినని పేర్కొంది. ఆరు వారాల క్రితమే మగ బిడ్డకు జన్మనిచ్చానని, భర్త, బాబుతో కలిసి మధుర క్షణాలను అనుభవిస్తున్నానని వివరించింది.
తమ జీవితంలోకి బాబు వచ్చిన తర్వాత చాలా కొత్తగా ఉందని పేర్కొంది. గత ఐదేళ్లుగా స్టార్స్పోర్ట్స్ తన కుటుంబంలో ఒకరిగా తనను చూసిందని, పలు కార్యక్రమాల్లో తనను భాగస్వామిగా చేశారని చెప్పుకొచ్చింది. ఈసారి ఐపీఎల్ను చూసి ఎంజాయ్ చేస్తానని మయాంతి లాంగర్ పేర్కొంది.