హైలైట్: ట్రంప్ చేతికి వెండి తాళం చెవి! బరువు అరకిలోపైనే..
ABN , First Publish Date - 2020-02-22T22:29:53+05:30 IST
ఈ సందర్భంగా మేయర్.. ఆగ్రా నగరం తాళం చెవిని ట్రంప్కు బహూకరించనున్నట్టు తెలిసింది.
ఆగ్రా: ఫిబ్రవరి 24న అమెరికా అధ్యక్షుడి తొలి భారత పర్యటన ప్రారంభం కానుంది. భార్య మెలానియా ట్రంప్, కూతరు ఇవాంకా, ఆమె భర్త జేరెడ్ కుష్నర్ కూడా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్తో ఈ పర్యటనలో పాల్గొంటారు. ఇక ఆగ్రాలోని తాజ్మహల్ సందర్శన ట్రంప్ పర్యటనలో ఓ ముఖ్య భాగమన్న విషయం తెలిసిందే. ట్రంప్ దంపతులను స్వాగతించేందుకు ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆగ్రా నగర మేయర్ నవీన్ జైన్కు కూడా విమానాశ్రయానికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా మేయర్.. ఆగ్రా నగరం తాళం చెవిని ట్రంప్కు బహూకరించనున్నట్టు తెలిసింది. 12 అంగుళాలు పొడవుండే ఈ తాళం చెవి పూర్తిగా వెండితో తయారైంది. దానిపై తాజ్మహల్ చిత్రంతో పాటు, వెలకమ్ టూ ఆగ్రా, ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ అనే పదాలు కనిపిస్తుంటాయి.
అధ్యక్షుడికి ఇటువంటి తాళం చెవి బహూకరించడం వెన ఉన్న ప్రాశస్త్యాన్ని మేయర్ ఇలా వివరించారు. ‘ఆగ్రా నగరానికి ఓ సాంప్రదాయం ఉంది. ప్రముఖ విదేశీ అతిథులు ఎవరైనా నగరానికి వచ్చినప్పుడు వారికి ఓ తాళం చెవి బహూకరిస్తాం. ఇది ఆగ్రా నగరానికి చెందిన తాళం చెవి. దీని సహాయంతో ఆగ్రా నగరం తలుపులు తెరిచి లోనికి ప్రవేశించాలని అతిథికి సూచిస్తాం. ఈ తాళం చెవి బరువుకు 600 గ్రాములు. ఇది తాజ్మహల్ను పోలి ఉంటుంది.’ అంటూ ఆ సంప్రదాయం గొప్పదనాన్ని వివరించారు.