హైదరాబాద్ మేయర్‌కు అరుదైన గౌరవం

ABN , First Publish Date - 2021-04-16T06:37:08+05:30 IST

భారత్‌ నుంచి హైదరాబాద్‌ మేయర్‌కు మాత్రమే ఆ గౌరవం దక్కింది..

హైదరాబాద్ మేయర్‌కు అరుదైన గౌరవం

  • యూఎన్‌ మేయర్ల సదస్సుకు ఆహ్వానం
  • భారత్‌ నుంచి ఏకైక మేయర్‌


హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి) : యునైటెడ్‌ నేషన్స్‌ ఇన్ఫర్మేషన్‌, కమ్యూనికేషన్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న గ్లోబల్‌ మేయర్ల సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మికి ఆహ్వానం అందింది. ప్రపంచంలోని 40 నగరాలకు చెందిన మేయర్లకు మాత్రమే ఈ వెబ్‌ ఆధారిత సదస్సులో పాల్గొనేందుకు అవకాశం ఉంది. భారత్‌ నుంచి హైదరాబాద్‌ మేయర్‌కు మాత్రమే ఆ గౌరవం దక్కింది. శుక్రవారం రాత్రి 8.15 గంటల నుంచి 10.15 గంటల వరకు జరిగే ఈ సదస్సులో వాతావరణంలో కార్బన్‌ ఉద్గారాలను తగ్గించి నగరాల్లో మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. లాస్‌ ఏంజెల్స్‌ మేయర్‌ ఎరిక్‌ గర్సెట్టి అధ్యక్షతన జరిగే సమావేశంలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటారెస్‌ ప్రసంగించనున్నారు. వీరితో పాటు యూఎన్‌ హ్యాబిటాట్‌కు చెందిన ఈడీ మైమూనా మహ్మద్‌ షరీఫ్‌తో పాటు మెల్బోర్‌, టోకియో, జకార్త, లియోయోడీజినిరో, ప్యారిస్‌, మిలన్‌, మాంట్రియల్‌, బార్సిలోనా, జోహనస్‌ బర్గ్‌ తదితర ప్రముఖ అంతర్జాతీయ నగరాల మేయర్లు పాల్గొననున్నారు.

Updated Date - 2021-04-16T06:37:08+05:30 IST