బ్యాంకు ఖాతా నుంచి రూ.1.5లక్షల మాయం
ABN , First Publish Date - 2021-06-20T05:57:33+05:30 IST
బ్యాంకు ఖాతా నుంచి రూ.1.5లక్షల మాయం
స్మార్ట్ఫోన్తో కొడుకు నిర్వాకం
లబోదిబోమంటున్న గిరిజన రైతు
కేసముద్రం, జూన్ 19: తొమ్మిదో తరగతి విద్యార్థికి ఆన్లైన్ క్లాసులున్నాయని తండ్రి స్మార్ట్ఫోన్ కొనిచ్చాడు.. అందులో ఏమి నొక్కాడో ఏం జరిగిందో తెలియదుకానీ.. సదరు విద్యార్థి తండ్రి బ్యాంకు ఖాతా నుంచి రూ.1.5లక్షలు బదిలీ అయ్యాయి. దీంతో లబోదిబోమంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసముద్రం మండలం భూక్యరాంతండా జీపీ పరిధిలోని కాలనీతండాకు చెందిన వాంకుడోత్ వెంకన్నకు కేసముద్రం ఎస్బీఐలో ఖాతా ఉంది. ఈనెల 15న ధాన్యం విక్రయించగా రూ.83,827లు, 17న రైతుబంధు పథకం రూ.11,875, మిర్చి అమ్మగా వచ్చిన డబ్బులు ఇదే ఖాతాలో జమ చేశాడు. మొత్తం ఖాతాలో రూ.1.50లక్షల నిల్వ ఉంది. శనివారం విత్తనాలను కొనేందుకు డబ్బులు అవసరమై డ్రా చేసేందుకు బ్యాంకుకు వెళ్లగా రూ.613 నిల్వ చూపడంతో తీవ్ర ఆందోళన చెంది. బ్యాంకు ఖాతా స్టేట్మెంట్ను తీయించాడు. అందులో ఈనెల 14నుంచి 19వ తేదీల మధ్యన కనిష్ఠంగా రూ.100 నుంచి గరిష్ఠంగా రూ.50వేల వరకు పలుమార్లు రూ.1.50లక్షల నగదు బదిలీ అయినట్లు చూపుతోంది. తొమ్మిదో తరగతి చదువుతున్న తన కుమారుడికి ఆన్లైన్ తరగతుల కోసం ఇటీవల స్మార్ట్ఫోన్ కొనిచ్చానని తెలిపారు. అందులో ఫోన్పే యాప్కు తన బ్యాంకు ఖాతాను అనుసంధానం చేసుకున్నాడని చెప్పారు. ఏ ఆప్షన్ నొక్కాడో, ఏం జరిగిందో తెలియడంలేదని రైతు వాపోయాడు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట డబ్బులు మాయమయ్యాయని విలపించాడు.