పంట నష్టాన్ని అంచనా వేయడంలో విఫలం
ABN , First Publish Date - 2022-01-22T05:44:26+05:30 IST
పంట నష్టాన్ని అంచనా వేయడంలో విఫలం
తప్పుడు లెక్కలు చూపుతున్న సర్కార్
రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే
కాంగ్రెస్ నేతలు పోరిక బలరాం నాయక్, బెల్లయ్యనాయక్
మహబూబాబాద్ టౌన్, జనవరి 21: తెలంగాణ రాష్ట్రంలో అకాలవర్షంతో రైతులు నష్టపోయిన పంటను అంచనా వేయడంలో తెలంగాణ సర్కార్ పూర్తి గా విఫలమైందని కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి తేజావత్ బెల్లయ్య నాయక్ విమర్శించారు. మహబూబాబాద్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడా టరు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంట నష్టాన్ని పరిశీలించేందుకు వచ్చిన మంత్రులు నిరంజన్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు టూరిస్టులుగా వచ్చి వేళ్లారని విమర్శించారు. కనీసం రైతులను పరామర్శించిన పాపానపోలేదని, కేవ లం ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి నామ్కే వాస్త్గా వచ్చి వెళ్లారని ఆరోపించా రు. ఎంత నష్టం జరిగిందో ఇప్పటికి వెళ్లడించలేదంటే వారి పరిశీలన ఎలా ఉందో రైతులు అర్థం చేసుకోవాలన్నారు. రైతు ప్రభుత్వమని చెబుతున్న సీఎం కేసీఆర్ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సీఎం మాత్రం 150 ఎకరాల్లో వరి సాగు చేయవచ్చు కానీ, రైతులు మాత్రం వరిసాగు చేయవద్దని మంత్రులతో చెప్పిస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలోనే 1200 ఎకరాల్లో పంట నష్టం జరిగి ఏడుగురు రైతులు చనిపోయారని, వారి కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం చొరవ చూపలేదని మండిపడ్డారు. భూస్వాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రైతుబంధు పేరిట లక్షల రూపాయాలను దోచిపెడుతున్నారని, పంట పండించే కౌలు రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు, ఏకకాలంలో రూ.70వేల కోట్ల రైతుల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. రాష్ట్రంలో 2లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే తెలంగాణ సర్కార్ మాత్రం తప్పుడు లెక్కలు చూపుతున్నారని, తమ వెంట వస్తే నష్టాన్ని చూపిస్తామని సవాల్ విసిరారు. సమావేశంలో మాజీ జడ్పీటీసీ జిన్నారెడ్డి వెంకట్వేర్లు, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మేక వీరన్న, గుగులోతు వెంకట్, రియాజ్అన్సారీ పాల్గొన్నారు