కివీస్పై భారత విజయాన్ని తక్కువ చేస్తూ ట్వీట్.. మెక్ క్లాగన్పై విమర్శల వెల్లువ
ABN , First Publish Date - 2021-12-11T00:32:02+05:30 IST
న్యూజిలాండ్తో స్వదేశంలో జరిగిన రెండు టెస్టుల సిరీస్ను భారత జట్టు 1-0తో గెలుచుకోవడంపై కివీస్
ముంబై: న్యూజిలాండ్తో స్వదేశంలో జరిగిన రెండు టెస్టుల సిరీస్ను భారత జట్టు 1-0తో గెలుచుకోవడంపై కివీస్ క్రికెటర్ మిచెల్ మెక్ క్లాగన్ చేసిన ట్వీట్ తీవ్ర విమర్శలకు కారణమైంది. ఇటీవల మెక్ ఒక ట్వీట్ చేస్తూ భారత విజయాన్ని తక్కువ చేసేందుకు ప్రయత్నించాడు. ఐసీసీ టెస్టు చాంపియన్ అయిన కివీస్ను భారత్ వారి సొంత గడ్డపై వారికి అనుకూలమైన పరిస్థితుల మధ్య ఓడించిందని పేర్కొన్నాడు. ఇందుకు భారత్ చాలా సంతోషంగా ఉండి ఉంటుందని హేళనగా ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్ చూసిన అభిమానులు మెక్పై విరుచుకుపడ్డారు. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో, ఇంగ్లండ్ను ఇంగ్లండ్ గడ్డపైనే టీమిండియా మట్టికరిపించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. అంతేకాదు, ఏ దేశమైనా స్వదేశంలో సింహమేనన్న సంగతిని మర్చిపోవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓటమిని కూడా గౌరవించడం నేర్చుకోవాలని, వాటి నుంచి కూడా పాఠాలు నేర్చుకోవాలంటూ చురకలు అంటించారు. అభిమానుల విమర్శలతో ఉక్కిరిబిక్కిరి అయిన మెక్.. ఆ తర్వాత రోజు మరో ట్వీట్ చేస్తూ.. జోక్ చేశానని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ అతడిపై విమర్శల జడివాన ఆగలేదు. కాగా, క్లాగన్ 48 వన్డేలు, 29 టీ20లలో కివీస్కు ప్రాతినిధ్యం వహించాడు. న్యూజిలాండ్ తరపున ఒక్కటంటే ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడకపోవడం గమనార్హం.