కొలువుదీరిన గణనాథులు

ABN , First Publish Date - 2022-09-02T06:32:48+05:30 IST

జిల్లాకేంద్రంతో పాటు పలు గ్రామాలు, పట్టణంలోని ప్రజలు బుధవారం వినాయక చవితి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.

కొలువుదీరిన గణనాథులు
కర్ర గణపతికి పూజలు చేస్తున్న మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

నిర్మల్‌ కల్చరల్‌, సెప్టెంబరు 1 : జిల్లాకేంద్రంతో పాటు పలు గ్రామాలు, పట్టణంలోని ప్రజలు బుధవారం వినాయక చవితి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. వాడవాడలా విభిన్న రూపాల్లో గణనాథులు కొలువుదీరారు. పిల్లలు, పెద్దలు మధ్యాహ్నం నుండి గణేష్‌ మండళ్ల నిర్వాహకులతో కలిసి మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించి, ప్రతిష్టించి ప్రత్యేక పూజలు జరిపి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. గణేష్‌ నిమ్జనం వరకు ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. పట్టణ కేంద్రంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి కర్ర వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలు ప్రారంభించారు. ఆయనతో పాటు మున్సిపల్‌ చైర్మన్‌ జి. ఈశ్వర్‌ పాల్గొన్నారు. ఇంద్రకరణ్‌ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి గోమయ గణపతి విగ్రహానికి ఆయన నివాసంలో ప్రత్యేక పూజలు చేశారు.  నగరేశ్వర వాడ, చింతకుంట వాడ ఇందిరానగర్‌, ఉద్గామ్‌, శాస్ర్తినగర్‌, బంగల్‌పేట, భాగ్యనగర్‌, ప్రియదర్శిని నగర్‌, ఆర్టీసీ డిపో ప్రాంగణాల్లో గణేష్‌ విగ్రహాలు నెలకొల్పి ప్రత్యేక పూజలు జరిపారు. డీఎస్పీ జీవన్‌ రెడ్డి తన కార్యాలయంలో గోమయ గణపతికి ప్రత్యేక పూజలు జరుపగా సహజ సిద్ధంగా తయారు చేసిన మట్టి విగ్రహాలను నెలకొల్పేందుకు భక్తులు ఆసక్తి కనబరిచారు. పలు కార్యాలయాల్లో ఉద్యోగులు వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. 

వినాయకుడికి పూజలు చేసిన కలెక్టర్‌...

జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ వినాయక చవితి సందర్భంగా బుధవారం వినాయకునికి పూజలు చేశారు. అదనపు కలెక్టర్లు హేమంత్‌ బోర్కడే, పి. రాంబాబు, ఆర్డీవో తుకారాం, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-02T06:32:48+05:30 IST