డొనాల్డ్ ట్రంప్ నామినేషన్ ఘట్టానికి మీడియాపై నిషేధం!

ABN , First Publish Date - 2020-08-02T23:02:04+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్‌ను ఎంపిక

డొనాల్డ్ ట్రంప్ నామినేషన్ ఘట్టానికి మీడియాపై నిషేధం!

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్‌ను ఎంపిక చేసే ప్రక్రియకు మీడియాను అనుమతించరాదని నిర్ణయించారు. మీడియా కథనాల ప్రకారం నవంబరులో జరిగే దేశాధ్యక్ష ఎన్నికలకు డొనాల్డ్ ట్రంప్‌ను నామినేట్ చేయడానికి జరిగే పార్టీ ఓటింగ్‌ను గోప్యంగా నిర్వహించాలని నిర్ణయించారు. 


మీడియాకు అనుమతి నిరాకరించడానికి కారణాలను రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ అధికార ప్రతినిథి వివరిస్తూ, కరోనా వైరస్ ఆరోగ్య సూత్రాల మార్గదర్శకాల మేరకు, తమ పార్టీ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ కవరేజీకి మీడియాకు అనుమతి ఇవ్వరాదని నిర్ణయించినట్లు తెలిపారు. 


కార్యక్రమాలకు హాజరయ్యేందుకు అనుమతించదగిన వ్యక్తుల సంఖ్య విషయంలో రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల మార్గదర్శకాలకు లోబడి తమ పార్టీ పని చేస్తోందని చెప్పారు. 


ఉత్తర కరోలినాలో ఛార్లోటీ నగరంలో ఈ నెల 24న జరిగే సమావేశంలో డొనాల్డ్ ట్రంప్‌ను దేశాధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థిగా లాంఛనంగా రిపబ్లికన్ పార్టీ ఎన్నుకుంటుంది. ఈ సమావేశంలో 336 మంది పార్టీ డెలిగేట్లు పాల్గొంటారు. వీరు దాదాపు 2,500 మంది అఫిషియల్ డెలిగేట్ల కోసం ప్రాక్సీ ఓట్లు వేస్తారు. పార్టీలో మిగిలిన ఏకైక నామినీ ట్రంప్ మాత్రమే. అధికారికంగా రీనామినేషన్‌ను ప్రకటించిన తర్వాత ట్రంప్ ఎన్నికల బరిలోకి దూకుతారు. 


Updated Date - 2020-08-02T23:02:04+05:30 IST