పరిశోధనలకు ప్రభుత్వం ప్రోత్సాహం
ABN , First Publish Date - 2021-01-21T06:10:22+05:30 IST
పరిశోధనలు, సరికొత్త ఆవిష్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి వెల్లడించారు
రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి
పెదగంట్యాడ, జనవరి 20: శాస్త్రవేత్తల పరిశోధనలు, సరికొత్త ఆవిష్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి వెల్లడించారు. విశాఖపట్నం మెడ్టెక్ జోన్లో ఏర్పాటైన స్కిల్ విజ్ఞాన్ సెంటర్ను బుధవారం మంత్రి గౌతంరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటైన సమావేశంలో మాట్లాడుతూ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పన పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించిందన్నారు. కరోనా సమయంలో లాక్డౌన్ను కూడా లెక్క చేయకుండా మాస్క్లు, వెంటిలేటర్ల తయారీలో శ్రమించిన మెడ్టెక్ జోన్ శాస్త్రవేత్తలు, ఉద్యోగులను మంత్రి అభినందించారు. అత్యాధునిక టెక్నాలజీ, సెన్సార్లు, కెమెరాలతో రోగి వ్యాధిని గమనించి, చికిత్స చేసే ఓ యంత్రాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ పనితీరును మెడ్టెక్ జోన్ సీవో జితేంద్ర శర్మ వివరించారు. పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీఐఐసీ ఎండీ రవీన్ కుమార్ రెడ్డి, పరిశ్రమల శాఖ అధికారులు, మెడ్టెక్ జోన్ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.