మేఘా ఇంజనీరింగ్.. రూ.20,000 కోట్ల సమీకరణ
ABN , First Publish Date - 2021-09-29T06:03:04+05:30 IST
ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా కొనుగోలు చేసేందుకు, కొత్త టెక్నాలజీ రంగాల్లో అడుగు
- ఏడాదిన్నరలో పబ్లిక్ ఇష్యూకు
- కొత్త టెక్నాలజీలపై దృష్టి
- ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా కొనుగోలు
(సోనామార్గ్ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా కొనుగోలు చేసేందుకు, కొత్త టెక్నాలజీ రంగాల్లో అడుగు పెట్టేందుకు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) రూ.15,000-20,000 కోట్ల నిధులను సమీకరించనుంది. రుణ సమీకరణ ద్వారా ఈ నిధులు సమీకరించనున్నట్లు ఎంఈఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణారెడ్డి తెలిపారు. ఏడాది, ఏడాదిన్నరలో పబ్లిక్ ఇష్యూ ద్వారా కూడా నిధులు సమీకరించే ఆలోచన ఉందని.. అయితే ఎంత సమీకరించేది భవష్యత్తులో నిర్ణయిస్తామని తెలిపారు.
ఎలక్ట్రిక్ ఆటోల తయారీ: హైడ్రోజన్ టెక్నాలజీలు వంటి కొత్త టెక్నాలజీల్లోకి ఎంఈఐఎల్ అడుగు పెట్టనుంది. గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీలోకి ప్రవేశించేందుకు ఇటలీ కంపెనీతో ఇటీవలే కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. మొదట ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువచ్చాం. ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేయడంతో పాటు నిర్వహణ కూడా చేస్తున్నాం. ప్రస్తుతం 1,000 బస్సులు దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఎలక్ట్రిక్ ఆటోలను కూడా తయారు చేస్తున్నాం.
దేశీయంగా చమురు అన్వేషణ రిగ్గులను తయారు చేస్తున్నాం. రక్షణ రంగంలో అనేక ప్రాజెక్టులను చేపట్టాం. అనేక టెక్నాలజీల్లోకిఽ ప్రవేశించాలన్నది కంపెనీ ఉద్దేశమని కృష్ణా రెడ్డి చెప్పారు. విదేశాల నుంచి నిధులు సేకరించి దేశీయంగా పెట్టుబడులు పెడతామన్నారు. భారత్ ఎర్త్ మూవర్స్, నీలాచల్ ఇస్పాత్, షిప్పింగ్ కార్పొరేషన్లలో వాటా కొనుగోలు చేయడానికి ఎంఈఐఎల్ అర్హత సంపాదించిందని కృష్ణా రెడ్డి తెలిపారు.